విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ.. జనవరి 27న లక్ష మందితో ప్రజాగర్జన
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వచ్చే నెల 27న లక్షమందితో ప్రజాగర్జన బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతలు తెలిపారు.తమిళనాడు జల్లికట్టు, తెలంగాణ ఉద్యమాలు స్పూర్తిగా తీసుకుని పోరాటం చేస్తామని అఖిలపక్ష నేతలు వెల్లడించారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో అఖిలపక్ష పోరాట కమిటీ అలర్ట్ అయ్యింది. దీనిలో భాగంగా జనవరి 27న విశాఖలో లక్షమందితో ‘‘ప్రజాగర్జన’’ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతలు తెలిపారు. 32 మంది అమరుల త్యాగాలతో సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుంటామని వారు స్పష్టం చేశారు. కోవిడ్ సమయంలోనూ కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేశారని.. సొంత మైన్స్ లేకున్నా ఫ్యాక్టరీని లాభాల బాటలో నడిపించారని వారు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కార్మాగారం దేశానికే తలమానికమని... తమిళనాడు జల్లికట్టు, తెలంగాణ ఉద్యమాలు స్పూర్తిగా తీసుకుని పోరాటం చేస్తామని అఖిలపక్ష నేతలు తెలిపారు.
ఇదిలావుండగా.. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలంటూ జీవీఎంసీ వద్ద చేపట్టిన నిరసన దీక్ష గత నెల 22 నాటికి 600 రోజులకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విశాఖ జిల్లా కార్మిక, ప్రజాసంఘాలు, ప్రభుత్వం రంగసంస్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రిలే నిరసన దీక్షలో కార్మికులు, వివిధ రాజకీయ పక్షాలు పెద్దఎత్తున నల్ల జెండాలతో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వామపక్షాలు, పార్టీల నాయకులు డిమాండ్ చేసారు.