Asianet News TeluguAsianet News Telugu

వైఎస్‌తో రాజీకి పరిటాల రవి అంగీకరించలేదు: పోతుల సురేష్ సంచలనం

2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో రాజీ చేసుకొందామని ఒక దశలో తాను ప్రతిపాదించినట్టు   పరిటాల రవికి ప్రతిపాదించినట్టు పరిటాల రవి సన్నిహితుడు  పోతుల సురేష్ చెప్పారు.  

Potula suresh sensational comments on Paritala Ravi


హైదరాబాద్: 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో రాజీ చేసుకొందామని ఒక దశలో తాను ప్రతిపాదించినట్టు   పరిటాల రవికి ప్రతిపాదించినట్టు పరిటాల రవి సన్నిహితుడు  పోతుల సురేష్ చెప్పారు.  ఈ ఒక్క ప్రతిపాదనతో పాటు మరో రెండు ప్రతిపాదనలను కూడ  తీసుకెళ్లినా.. రవి మాత్రం అంగీకరించలేదని ఆయన గుర్తు చేసుకొన్నారు.

ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  పరిటాల సన్నిహితుడు పోతుల సురేష్  పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.  రవితో  తనకు ఉన్న సంబంధాలు, రాజకీయ భవిష్యత్‌ గురించి వివరించారు.

2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో  ఆనాడు  నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా  పరిటాల రవి వద్దకు తాను మూడు  ప్రతిపాదనలను తీసుకెళ్లినట్టు పోతుల సురేష్ చెప్పారు.  ఇప్పటివరకు తమకు అండగా ఉన్న గ్రూపును కాపాడుకొనేందుకు గాను నేతలంతా కలిసే ఉండాలనేది మొదటి ప్రతిపాదనగా  రవి వద్ద ప్రస్తావించినట్టు చెప్పారు.

ఇక వ్యక్తిగతంగా ఎవరికి వారు  అజ్ఞాతంలోకి వెళ్లి ప్రాణాలు రక్షించుకోవడంపై కేంద్రీకరించడమనేది రెండో ప్రతిపాదనగా రవికి  చెప్పానని ఆయన గుర్తు చేశారు ఇక మూడో ప్రతిపాదనగా  వైఎస్ కుటుంబంతో  ఎలాంటి శత్రుత్వం లేనందున  ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌తో రాజీ ప్రతిపాదనను చేశానని ఆయన చెప్పారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ కుటుంబం.. టీడీపీ అధికారంలోకి వస్తే  మనకు ఇబ్బంది ఉండదని తాను ఈ ప్రతిపాదన చేసినట్టు పోతుల సురేష్  చెప్పారు.  అయితే ఈ మూడు ప్రతిపాదనలను  పరిటాల రవి తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన చెప్పారు.

ఆనాడు నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా  ఎవరికి వారు  అజ్ఞాతంలోకి వెళ్లి ప్రాణాలు దక్కించకోవడమే మేలని పరిటాల రవి సూచించారని పోతుల సురేష్ చెప్పారు.  అయితే తాను మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లనని ఆయన చెప్పారు. అప్పటికే ఎమ్మెల్యేగా ఉేన్నందున  తాను మాత్రం గ్రామంలోనే ఉంటానని రవి చెప్పారని ఆయన చెప్పారు.

ఆర్‌ఓసీ నేతగా ఉన్న తగరకుంట ప్రభాకర్ రెడ్డి హత్య తర్వాత  తమ ప్రాణాలకు కూడ ముప్పు ఉంటుందని భావించిన నేపథ్యంలో తమ కుటుంబసభ్యులు, సన్నిహితుల సూచన మేరకు  తాను  కూడ అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని  ఆయన చెప్పుకొచ్చారు.

అజ్ఞాతంలో ఉన్న సమయంలో తనతో పాటు తన కుటుంబానికి పరిటాల రవి కుటుంబం నుండి కానీ, ఎవరి నుండి కానీ తనకు ఎలాంటి సహాయం అందలేదన్నారు. తానే ఇతరులకు సహాయం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

పరిటాల రవికి తాను గురువునని ఆయన చెప్పారు.  పీపుల్స్ వార్  (ఇప్పటి మావోయిస్టు పార్టీ)లో తాము పనిచేసేవారమని ఆయన చెప్పారు.  1983 లో పీపుల్స్ వార్ పార్టీ  పరిటాల రవిని  పార్టీలో పుల్‌టైమర్ గా పనిచేయాలని కోరిందన్నారు. కానీ, రవి మాత్రం పార్టీకి గ్రామంలో ఉంటూనే సహాయం చేసేందుకు అంగీకరించాడని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరాడన్నారు.  రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత  గురువును మించిన శిష్యుడుగా పరిటాల రవి ఎదిగాడని పోతుల సురేష్ చెప్పారు.

ఆర్ఓసీని ఏర్పాటు చేసి పరిటాల ప్రత్యర్ధులను చంపడమే లక్ష్యంగా పెట్టుకొన్నట్టు జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఎవరిని కూడ  తాము ఉద్దేశపూర్వకంగా దాడి చేయలేదన్నారు. అలా చేసినట్టు నిరూపిస్తే తాను అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఉరేసుకొంటానని ఆయన చెప్పారు.

పరిటాల రవి పేరు చెప్పుకొని తాను భూముల సెటిల్ మెంట్లకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. 2004 లో  వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి  మంగళి కృష్ణ మధ్యవర్తిత్వం ద్వారా తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు  ప్రయత్నం చేసినట్టు వచ్చిన వార్తలు నిరాధారమైనవని ఆయన కొట్టిపారేశారు. మంగళి కృష్ణను ఇంతవరకు తాను ముఖాముఖి కలుసుకోలేదని చెప్పారు.

1997-98 కాలంలో అనంతపురంలో పరిటాల రవి  ఇల్లును నిర్మిస్తున్న సమయంలో సూట్ ‌కేసు బాంబు పేలుడు జరిగిందన్నారు.  అయితే ఈ ఘటన తర్వాతే  వైఎస్ కుటుంబానికి పరిటాల కుటుంబానికి మధ్య విబేధాలు వచ్చాయని పోతుల సురేష్ అభిప్రాయపడ్డారు. మరో వైపు వైఎస్ రాజారెడ్డిని హత్య చేసిన వారికి  పరిటాల రవి సహకరించాడనే ప్రచారం జరిగిన సమయంలో కూడ ఈ విషయమై తాను రవితో  చర్చించినట్టు ఆయన చెప్పారు.

పరిటాల రవి కుటుంబాన్ని నా కుటుంబంగానే తాను భావిస్తానని ఆయన చెప్పారు.  రవి కుటుంబసభ్యులు కూడ అదే రకంగా భావిస్తారని తాను అనుకొంటున్నట్టు ఆయన చెప్పారు.  తన భార్య సునీతకు ఎమ్మెల్సీ విషయంలో సహకరించాలని  సునీతను కోరినట్టుగా ఆయన గుర్తు చేశారు.

2019 ఎన్నికల్లో హిందూపురం ఎంపీ టిక్కెట్టు తనకు ఇవ్వాలని  చంద్రబాబునాయుడును కోరుతున్నట్టు చెప్పారు.  ఈ విషయంలో సహకరించాలని అనంతపురం జిల్లాకు చెందిన పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

పరిటాల శ్రీరామ్ ఒక వేళ ఎంపీ స్థానం నుండి బరిలోకి దిగితే తాను ఎమ్మెల్యే స్థానం నుండి పోటీ చేస్తానని చెప్పారు. శ్రీరామ్ ఎమ్మెల్యే స్థానం నుండి పోటీ చేస్తే తాను ఎంపీ స్థానానికి పోటీ చేస్తానని  పోతుల సురేష్ చెప్పారు.

పరిటాల రవి అనంతపురం జిల్లాలో ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే  తాను  ధైర్యంగా ప్రశ్నించానని ఆయన చెప్పారు.  మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగానే తాను పరిటాల రవిపై  ఆరోపణలు చేసేవాడినని చెప్పడంలో వాస్తవం లేదన్నారు.

పరిటాల రవి రాజకీయ ఎదుగుదల తమ త్యాగాల పునాదులపై జరిగిందని ఆయన గుర్తు చేశారు. రాజకీయంగా తమ ఎదుగుదలకు పరిటాల కుటుంబం సహకరించాలని ఆయన కోరారు. 

తాను అనంతపురం జిల్లా నుండి పోటీ చేయాలని గతంలో భావించానని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఈ విషయాన్ని పరిటాల రవి వద్ద చర్చిస్తే  ఇద్దరం ఒకే జిల్లాలో  పోటీ చేస్తే ప్రయోజనం ఉండదని  పరిటాల రవి  తనకు గుర్తు చేశారని ఆయన చెప్పారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios