తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మూడు రాజధానులు అంశంపై దుష్ప్రచారంతో పాటు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నాయకుల పరువుకు భంగం కలిగేలా వీడియోలు చేస్తున్నాడని ‘కుండబద్దలు’ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు కాటా సుబ్బారావుకు పోలీసులు నోటీసులు అందించారు.  

అమరావతి : రాజకీయ విశ్లేషకుడు, ‘కుండబద్దలు’ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు కాటా సుబ్బారావుకు అనంతపురం జిల్లా గుమ్మగట్ట పోలీసులు సోమవారం 41ఏ నోటీసులు అందించారు. మూడు రాజధానులు అంశంపై దుష్ప్రచారం తోపాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, వైసీపీ నాయకుల పరువుకు భంగం కలిగేలా వీడియోలు రూపొందించి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని 2020 జనవరి 5న రాయదుర్గంకి చెందిన కె రామాంజనేయులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు కాటా సుబ్బారావు సోమవారం నోటీసులు ఇచ్చారు.

పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో నివసించే సుబ్బారావు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. సోమవారం ఇలాగే డయాలిసిస్ పూర్తి చేసుకుని గణపవరం చేరుకోగానే అనంతపురం నుంచి వచ్చిన పోలీసులు అతనికి నోటీసులు అందించారు. ఏ రోజు ఎక్కడకి రావాలన్నది నోటీసులో పేరు లేదు.

శ్రీకాకుళంలో అమానవీయ ఘటన: ఇద్దరు మహిళలపై ట్రాక్టర్ తో కంకర పోసిన దుండగులు

రాష్ట్రం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమే…
పోలీసులు ఇచ్చిన నోటీసులను అందుకున్న సుబ్బారావు గణపవరంలో మీడియాతో మాట్లాడారు. ‘నేను 2017 జూలై నుంచి ‘కుండబద్దలు’ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను. విశ్లేషణ చేయడం మినహా ఎవరినీ దూషించలేదు. వాడకూడని భాష వాడలేదు. రాష్ట్రంలో నడుస్తున్న నియంతృత్వ, పోలీసు పాలన నా వరకు వచ్చింది. 70 ఏళ్ల వయసులో వారానికి నాలుగు సార్లు డయాలసిస్ చేయించుకుంటున్న నాపై కేసు పెట్టారు. ఈ స్థితిలోనూ రాష్ట్రం కోసం ఏదైనా చేయాలనే తపనతోనే చేస్తున్నా’ అని పేర్కొన్నారు. సుబ్బారావు కోసం అనంతపురం నుంచి పోలీసులు వచ్చారని తెలుసుకున్న టీడీపీ నేతలు ఆయనకు అండగా నిలిచారు.