తిరుమలలో కానిస్టేబుల్ దందా.. భక్తుల వద్ద డబ్బు తీసుకుని అక్రమంగా దర్శనానికి
శ్రీవారి ఆలయంలోకి అక్రమంగా భక్తులను పంపుతోన్న కానిస్టేబుల్ను టీటీడీ విజిలెన్స్ బుధవారం పట్టుకుంది. బుధవారం భక్తుల నుంచి నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
![police constable arrested in tirumala police constable arrested in tirumala](https://static-ai.asianetnews.com/images/01gf595xkdchbecewe60jbytr5/tirumala-temple-to-be-closed-for-pilgrim-worship-on-oct-25-and-november-8-due-to-eclipse_363x203xt.jpg)
ప్రభుత్వం, టీటీడీ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా తిరుమలలో అక్రమాలు ఆగడం లేదు. తాజాగా శ్రీవారి ఆలయంలోకి అక్రమంగా భక్తులను పంపుతోన్న కానిస్టేబుల్ను టీటీడీ విజిలెన్స్ బుధవారం పట్టుకుంది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఇతను కొందరితో కలిసి ఈ దందాను నడుపుతున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. భక్తుల నుంచి డబ్బు తీసుకుని టికెట్లు లేకపోయినప్పటికీ వారిని క్యూలో పంపుతున్నట్లుగా తెలిసింది. ఈ క్రమంలో బుధవారం భక్తుల నుంచి నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
కొద్దిరోజుల క్రితం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం టోకెన్లను విక్రయిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను టీటీడీ విజిలెన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. భక్తుల ఫిర్యాదుతో కేవీఎం సంస్థలో పనిచేస్తున్న మస్తానయ్యను పట్టుకున్నారు విజిలెన్స్ పోలీసులు. అతని వద్ద నుంచి 76 ఉచిత లడ్డూ టోకెన్లను స్వాధీనం చేసుకున్నారు.
ALso REad:తిరుమల శ్రీవారి లడ్డూ బరువుపై టీడీపీ విమర్శలు.. కారణమిదే, క్లారిటీ ఇచ్చిన టీటీడీ
మరోవైపు... శ్రీవారి భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ బరువు తగ్గిందంటూ తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 175 గ్రాములు వుండాల్సిన లడ్డూ బరువు ఎంత తూగిందో మీరే చూడాలని ఓ వీడియోను పంచుకుంది. లడ్డూలు చిన్నవిగా ఉండటాన్ని ఓ భక్తుడు నిలదీశాడు. దీంతో కౌంటర్లోని ఉద్యోగి లడ్డూని వెయింగ్ మెషీన్పై ఉంచడంతో .. అది 90 గ్రాములు తూగినట్లు కనిపించింది. ఇది పెద్ద చీటింగ్ అంటూ సదరు భక్తుడు ఆరోపించాడు. దీనిపై టీటీడీ వివరణ ఇచ్చింది.
వెయింగ్ మెషీన్లో సాంకేతిక సమస్య ఏర్పడిందని.. దాంతో మైనస్ 70 అని వుందని తెలిపింది. అంతేకాకుండా కాంట్రాక్ట్ సిబ్బంది అవగాహనా లోపంతో ... లడ్డూ బరువుపై భక్తులు అపోహలకు గురయ్యారని టీటీడీ అభిప్రాయపడింది. లడ్డూ కౌంటర్ల వద్ద ఇబ్బందులు ఎదురైతే తక్షణం కౌంటర్ అధికారికి తెలియజేయాలని.. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. అయితే సదరు భక్తుడికి ఈ విషయం తెలియక తమపై ఆరోపణుల చేశారని టీటీడీ పేర్కొంది. తిరుమల శ్రీవారి లడ్డూ 160 నుంచి 180 గ్రాముల బరువు వుంటుందని తేల్చిచెప్పింది. దీనిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. అన్ని రకాల తనిఖీలు పూర్తయ్యాకే లడ్డూలను కౌంటర్లకు తరలిస్తామని టీటీడీ పేర్కొంది.