నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ ఘటనపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఐదుగురు నిందితులను గుర్తించారు.
నెల్లూరులోని (nellore) కోర్టులో (court) చోరీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని గుర్తించిన పోలీసులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు పోలీసులు. నిందితుల్లో కానిస్టేబుల్, ఓ కోర్టు ఉద్యోగి వున్నారు.
కాగా.. నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలోని 4వ అదనపు కోర్టులో గురువారం నాడు చోరీ జరిగింది. ఈ చోరీలో పలు కేసులకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి (kakani govardhan reddy)పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandramohan reddy) వేసిన కేసుకు సంబంధించిన ఆధారాలు చోరీకి గురయ్యాయని ప్రచారం సాగుతుంది. ఈ కేసుతో పాటు ఇతర కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా చోరీకి గురి కావడం కలకలం రేపుతుంది.
మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ లలో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపారని కాకాని గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలనూ ఇటీవల విడుదల చేశారు. ఆ పత్రాలను మీడియా ముందు కూడా ఉంచారు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవని, తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, ఈ నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన పత్రాలు ఫోర్జరీవిగా పోలీసులు గుర్తించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి తెచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీవి అని తేలిందని ఫోరెన్సిక్ లేబోరేటరీ తేల్చింది. అసలు సోమిరెడ్డి మలేషియాకు వెళ్లలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధృవీకరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో కొందరిని అరెస్టు కూడా చేశారు. ఈ మేరకు పలువురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు చార్జీషీట్ ను కూడా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో భద్రపర్చారు. అయితే కోర్టులో భద్రపర్చిన ఆధారాలు చోరీకి గురి కావడం ప్రస్తుతం కలకలం రేపుతుంది. కాకానిపై ఉన్న కేసుకు సంబంధించిన ఆధారాలతో పాటు ఇతర కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా చోరీకి గురికావడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై కోర్టు సిబ్బంది చిన్నబజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా Police కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
