ప్రధాని మోదీ శుక్రవారం అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ, పరిసర ప్రాంతాల్లో ఉదయం నుండి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. వివిధ మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నారు.
Traffic Divertions in Vijayawada : భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రధాని ప్రారంభించనున్నారు... ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేసారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు :
శుక్రవారం ఉదయం నుండి విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. విజయవాడ మీదుగా ప్రయాణించే వాహనాలను ఇతర ప్రాంతాల మీదుగా మళ్లించనున్నారు.
విశాఖ నుంచి వచ్చే భారీ వాహనాలను పొట్టిపాడు టోల్ప్లాజా దగ్గర నిలిపివేయనున్నారు. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు ఇబ్రహీంపట్నం టెర్మినల్ దగ్గర నిలిపివేస్తారు.
చెన్నై నుండి విశాఖపట్నం వెళ్లే వాహనాలను విజయవాడ, ఇబ్రహీంపట్నం, నందిగామ, చీరాల, బాపట్ల, రేపల్లె, అవనిగడ్డ, పామర్రు, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్లే వాహనాలను బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూడి వంతెన, అవనిగడ్డ, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లించనున్నారు.
గన్నవరం నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను అగిరిపల్లి, శోభనాపురం, మైలవరం, జి. కొండూరు, ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లించారు. ఇక కాకినాడ, ప్రకాశం, గుంటూరు, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టిఆర్ జిల్లాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు చెబుతున్నారు,
ప్రధాని మోదీ ఏపీ టూర్ షెడ్యూల్ :
నేడు అమరావతిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మద్యాహ్నం 2:55 గంటలకు గన్నవరం విమానాశ్రయాని మోదీ చేరుకుంటారు. ఆయనకు మంత్రులు, కూటమి నేతలు స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 3:15కి సచివాలయం వద్దకు ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకుంటారు... ఇక్కడ ప్రధానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సభాస్థలికి ప్రధాని మోదీ చేరుకుంటారు.
అమరావతి పునర్నిర్మాణ పనులను ఈ సభావేధిక నుండే ప్రధాని ప్రారంభిస్తారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి సంకేతంగా పైలాన్ ఏర్పాటుచేసారు.. అమరావతిలోని ఇంగ్లీష్ మొదటి అక్షరం A ఆకారంలో 21 అడుగుల ఎత్తులో పైలాన్ ఉంది. దీన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 4:55కి గన్నవరం చేరుకుని అక్కడినుండి డిల్లీకి పయనం కానున్నారు,