ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన సభ వేదికపై నుంచి ఆయన వర్చువల్గా రూ. 10,500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనలో భాగంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరిగిన సభ వేదికపై నుంచి ఆయన వర్చువల్గా రూ. 10,500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. విశాఖపట్నం ఓడరేవు ప్రాచీన భారతదేశంలోని ముఖ్యమైన ఓడరేవు అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. విశాఖ ఓడరేవు ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం జరిగిందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా విశాఖ విరజిల్లుతోందని అన్నారు. నేటికీ విశాఖపట్నం భారతదేశంలో వాణిజ్య కేంద్రంగా ఉందని తెలిపారు.
ప్రధాని మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఇవే..
- ఆరు లేన్ల గ్రీన్ఫీల్డ్ రాయ్పూర్-విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్లో ఆంధ్రప్రదేశ్ విభాగానికి మోదీ శంకుస్థాపన చేశారు. రూ. 3750 కోట్లకు పైగా వ్యయంతో దీన్ని నిర్మించనున్నారు.
-విశాఖపట్నంలోని కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ జంక్షన్ వరకు ప్రత్యేక పోర్ట్ రోడ్డుకు మోదీ శంకుస్థాపన చేశారు. ఇది విశాఖపట్నం నగరంలో స్థానిక, ఓడరేవుకు వెళ్లే గ్రూడ్స్ ట్రాఫిక్ను వేరు చేయడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించనుంది.
- శ్రీకాకుళం-గజపతి కారిడార్లో భాగంగా రూ. 200 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన ఎన్హెచ్-326ఏ లోని నరసన్నపేట నుంచి పాతపట్నం సెక్షన్ను మోదీ జాతికి అంకితం చేశారు.
-ఆంధ్రప్రదేశ్లోని ఒఎన్జీసీ యు-ఫీల్డ్ ఆన్షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ను మోదీ జాతికి అంకితం చేశారు. దీనిని రూ. 2900 కోట్లు కంటే ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేశారు.
-దాదాపు 6.65 ఎంఎంఎస్సీఎండీ సామర్థ్యంతో గెయిల్కు చెందిన శ్రీకాకుళం అంగుల్ సహజ వాయువు పైప్లైన్ ప్రాజెక్ట్కు మోదీ శంకుస్థాపన చేశారు. రూ. , 2650 కోట్లకు పైగా వ్యయంతో 745 కి.మీ పొడవున్న ఈ పైప్లైన్ను నిర్మించనున్నారు.
-రూ. 460 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ పునరాభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన చేశారు. పునరాభివృద్ధి చేయబడిన స్టేషన్ రోజుకు 75,000 మంది ప్రయాణీకులను సేవలను అందించేందుకు వీలుగా ఉండనుంది.
-విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ, అప్గ్రేడేషన్కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ. 150 కోట్లు.
