వారిని చూస్తుంటే జాలేస్తోంది
అప్పటికే పార్టీలోని సీనియర్లు, నియోజకవర్గ ఇన్ ఛార్జీలు ఫిరాయింపు ఎంఎల్ఏలను ఏమాత్రం ఖాతరు చేయటం లేదు.
వాళ్ళని చూస్తే జాలేస్తోంది. తాము గెలిచిన పార్టీలో ఉన్నపుడు ఇంటా, బయట బాగా విలువుండేది. పార్టీ మారిన తర్వాత వారిని పట్టించుకునే నాధుడే కరువయ్యారు. చివరకు పార్టీలో వారి ఉనికే కరువైంది. ఇదంతా వైసీపీ నుండి టిడిపిలోకి ఫిరాయించిన 21 మంది ఎంఎల్ఏల గురించే.
ఫిరాయింపు ఎంఎల్ఏల్లో భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రూ, జలీల్ ఖాన్లకు చంద్రబాబు మంత్రిపదవులు ఇస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. చంద్రబాబు నైజం తెలిసీ వెనకాముందు చూడకుండా వైసీపీకి గుడ్ బై చెప్పేసారు.
ప్రతిపక్షంలో ఉన్నంత వరకూ వారికి బాగానే విలువుండేది. పార్టీ మారిన తర్వాతే గందరగోళంలో పడ్డారు.
పార్టీ మారేంత వరకూ ఫిరాయింపు ఎంఎల్ఏలకు చంద్రబాబు ఇచ్చిన విలువ అంతా ఇంతా కాదు. ఒక్కసారి పార్టీ మారారంటే వారి సంగతి అంతే. భూమా, జ్యోతుల, జలీల్, అత్తార్, ఆదినారాయణరెడ్డి తదితరుల పరిస్ధితి సేమ్ టు సేమ్.
అవసరం కాబట్టి పార్టీలోకి వచ్చే ముందు వారిని చంద్రబాబు బాగానే ఆధరంగా చూసారు. చేరేముందు, చేరిన కొత్తల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వారికి చంద్రబాబు అప్పాయింట్ మెంట్ దొరికేది. చేరిన కొంతకాలం తర్వాత నుండి వారెవరికీ సిఎం అప్పాయింట్ మెంట్ దొరకటం లేదు.
టిడిపిలోకి చేరిన తర్వాత తమకు ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పుకుందామన్నా సాధ్యం కావటం లేదు.
అప్పటికే పార్టీలోని సీనియర్లు, నియోజకవర్గ ఇన్ ఛార్జీలు ఫిరాయింపు ఎంఎల్ఏలను ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. కర్నూలు జిల్లా నంధ్యాల, ప్రకాశం జిల్లా అద్దంకి, కడప జిల్లా జమ్మలమడుగు, అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గాల్లో జరుగుతున్న వివాదాలే సాక్ష్యం. ఫిరాయింపు ఎంఎల్ఏల మాట ఏ విషయంలో కూడా సాగటం లేదు.
ఇదంతా తరచి చూసుకుంటూ కొందరు వారిలో వారే భోరుమంటున్నట్లు సమాచారం. వారితో పాటు పార్టీ మారిన క్యాడర్లో కూడా తీవ్ర అసంతృప్తి చేటు చేసుకుంటోంది. కానీ ఏమీ చేయలేని పరస్ధితిలో ఉన్నారు.
మంత్రిపదవి హామీ దేవుడెరుగు వచ్చే ఎన్నికల్లో తమలో ఎందరికీ టిక్కెట్లు వస్తాయో కూడా తెలీని అయోమయంలో ఫిరాయింపు ఎంఎల్ఏలున్నారంటే నిజంగానే జాలేస్తోంది వారిని చూస్తుంటే. ఎందుకంటే, వారి వ్రతమూ చెడింది..ఫలితమూ దక్కలేదు