జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే పేర్ని నాని మరోసారి విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ పదికాలాల పాటు బాగుండాలనే పవన్ జనసేన పార్టీ స్థాపించారని అన్నారు. ఇప్పుడు కూడా అకాలవర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించడానికంటూ పవన్ చేస్తున్నది చంద్రబాబుకు అనుకూల రాజకీయమని అన్నారు. చివరకు చంద్రబాబు కోసం బరితెగించిన పవన్ అబద్ధాలు మాట్లాడుతున్నాడని నాని ఆరోపించారు.
పవన్ కల్యాణ్ కు సినిమాలే ముఖ్యమని... రాజకీయాలు కేవలం చంద్రబాబు కోసమేనని పేర్ని నాని అన్నారు. అందుకే ఆరు నెలలకోసారి సినిమాల్లో ఖాళీ దొరికినప్పుడు వచ్చి జగన్ ను తిట్టడానికి రోడ్డుమీదకు వస్తున్నాడన్నారు.ఈ పదేళ్లలో పట్టుమని 10 రోజులు కూడా పవన్ ఏపీలో లేడంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేసారు.
వారాహి వాహనం పేరిట హడావుడి చేసిన పవన్ కల్యాణ్ దసరా నుంచి రాష్ట్ర పర్యటన చేపడతానని అన్నాడని నాని గుర్తుచేసారు. దాన్ని వాయిదా వేసి మళ్లీ ఇప్పుడు జూన్ నుంచి రాష్ట్ర పర్యటన చేస్తానని అంటున్నాడని గుర్తుచేసారు. అది జరుగుతుందో లేదో డౌటేనని పేర్ని నాని అన్నారు.
Read More ఎన్నికలకు ముందే హ్యాండ్సప్.. పవన్ అంత అసమర్ధుడు వుండడు, జనసేన పెట్టిందే బాబు కోసం : అంబటి రాంబాబు
రాజకీయాల్లో కులాల ప్రస్తావన తీసుకువచ్చి డివైడ్ ఆండ్ రూల్ పాలిటిక్స్ చేస్తున్నదే పవన్ అని మాజీ మంత్రి అన్నారు. కేవలం కాపులనే కాదు రాష్ట్ర ప్రజలందరినీ పవన్ తిడుతున్నాడని అన్నారు. చంద్రబాబు ముద్రగడ ను ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు? సీఎం జగన్ ను టీడీపీ పట్టాభి అనకూడని మాటలంటే మానవతావాదిగా ఎందుకు మాట్లాడలేదు? అంటూ పవన్ ను పేర్ని నాని ప్రశ్నించారు.
కాపు రిజర్వేషన్ల గురించి ఎన్నికల సమయంలోనే జగన్ స్ఫష్టత ఇచ్చారు.... తన చేతుల్లో ఏమీ లేదని ముందే నిజం చెప్పినట్లు పేర్ని నాని తెలిపారు. కానీ ప్రతిసారి పవన్ సీఎం కాపులకు అన్యాయం చేస్తున్నట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కాపులకు అన్యాయం చేసిన బాబుపంచన చేరిన పవన్ సీఎం జగన్ ను విమర్శించడం విడ్డూరంగా వుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.
