Vizianagaram: మైనారిటీలు, స‌మాజంలోని ఇత‌ర వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు జీవనోపాధి, గౌరవం, సాధికారత కల్పించిన వైఎస్సార్‌సీపీకి మద్దతిచ్చేందుకు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నార‌నీ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీ కూటమిని ప్రజలు తిరస్కరిస్తారని ఆంధ్ర ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.  

AP Education Minister Botsa Satyanarayana: జ‌న‌సేన‌, తెలుగు దేశం పార్టీ (టీడీపీ) వచ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయ‌నున్నాయి. ఇప్ప‌టికే ఈ విష‌యం పై రెండు పార్టీలు స్ప‌ష్ట‌త‌ను ఇచ్చాయి. అయితే, అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ నాయ‌కులు ఈ రెండు పార్టీల కూట‌మిని టార్గెట్  చేస్తూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మైనారిటీలు, సమాజంలోని ఇతర అట్టడుగు వర్గాలు, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు జీవనోపాధి, గౌరవం, సాధికారత కల్పించిన వైఎస్సార్‌సీపీకి మద్దతిచ్చేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నందున 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీ కూటమిని ప్రజలు తిరస్కరిస్తారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

గజపతినగరం నియోజకవర్గంలో జరిగే సామాజిక సాధికార యాత్రకు ముందు మంత్రి బొత్స విజయనగరంలో విలేకరుల సమావేశంలో మంత్రులు బూడి ముత్యాల నాయుడు, మేరుగ నాగార్జునతో కలిసి మాట్లాడారు. 2014లో అధికారం చేపట్టిన తర్వాత టీడీపీ మేనిఫెస్టోను అమలు చేయకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేశారని సత్యనారాయణ ఆరోపించారు. అందుకే ఇదివ‌ర‌కటి ఎన్నిక‌ల్లో టీడీపీని ప్ర‌జ‌లు తిర‌స్క‌రించార‌ని పేర్కొన్నారు. అలాగే, టీడీపీ పాల‌న‌లో చోటుచేసుకున్న కుంభ‌కోణాలు, అవినీతిని గురించి కూడా మంత్రి ప్ర‌స్తావించారు. టీడీపీ అధినే, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడును న్యాయస్థానం జైలుపాలు చేసిందన్నారు. దీనిని వారి అవినీతే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు.

చంద్ర బాబు సతీమణి నారా భువనేశ్వరి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన‌ ఆరోపణలను మంత్రి బొత్స‌ కొట్టిపారేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా సభలు నిర్వహిస్తున్నారనీ, పరిపాలన ద్వారా వాక్ స్వాతంత్య్రాన్ని హరించొద్దని సూచిస్తోందన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడు, ఎస్.కోట శాసనసభ్యుడు కడుబండి శ్రీనివాసరావు, వైఎస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.