దేవినేని ఉమా వ్యవహారం.. బాబులో అగ్రవర్ణ అహంకారం తగ్గలేదు, నిజనిర్ధారణకు మేమూ వస్తాం: జోగీ రమేశ్
దళితులను దూషించిన వ్యక్తి ఇంటికి వెళ్లిన చంద్రబాబుకు కనీస పశ్చాత్తాపం లేదంటూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఫైరయ్యారు. కొంచెం కూడా ఆయన అగ్రవర్ణ అహంకారం తగ్గలేదని ఆరోపించారు. దళితులు, బీసీ, మైనారిటీల ఓట్లు కావాలి కానీ...వారిని దూషించడం మాత్రం ఆగదని జోగీ రమేశ్ హితవు పలికారు
టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు వైసీపీ నేత, పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్. శనివారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు బుద్ధి కొంచెం కూడా మారలేదంటూ ధ్వజమెత్తారు. దళితులను దూషించిన వ్యక్తి ఇంటికి వెళ్లిన ఆయనకు కనీస పశ్చాత్తాపం లేదంటూ జోగి రమేశ్ ఫైరయ్యారు. కొంచెం కూడా ఆయన అగ్రవర్ణ అహంకారం తగ్గలేదని ఆరోపించారు.
దళితులు, బీసీ, మైనారిటీల ఓట్లు కావాలి కానీ...వారిని దూషించడం మాత్రం ఆగదని జోగీ రమేశ్ హితవు పలికారు. ఒక దళితుడిని కులం పేరుతో దేవినేని ఉమా దూషిస్తే చంద్రబాబు పెద్దగా రంకెలేస్తున్నారంటూ మండిపడ్డారు. దళిత సంఘాలు నిరసన తెలిపితే రౌడీయిజం అంటారా.. మా ఆత్మగౌరవం కోసం నిరసన చేసే హక్కు కూడా మాకు లేదా అని జోగీ రమేశ్ ప్రశ్నించారు. దేవినేని ఉమా హయాంలో అక్కడి మైనింగ్ నుంచి అన్నీ లూటీ చేసింది ఎవరు అని ఆయన నిలదీశారు.
Also Read:అక్రమ మైనింగ్ రగడ.. బెజవాడలో టీడీపీ నేత వంగలపూడి అనిత అరెస్ట్ (ఫోటోలు)
25 ఎళ్ల పాటు ఏపీకి వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని.. మీకు రేపు అనేది ఉండదని జోగీ రమేశ్ జోస్యం చెప్పారు. మా వర్గాలపై పెత్తనం చేసావు కాబట్టే టీడీపీకి ప్రజలు 23 సీట్లు ఇచ్చారని.. నిజనిర్దారణ కమిటీ అంటూ తాడూ బొంగరం లేని వాళ్ళని పంపారంటూ సెటైర్లు వేశారు. అక్కడ దోచుకుంది ఎవరు..? వాస్తవాలు ఏమిటి అనేది మొత్తం తేలుస్తామని జోగీ రమేశ్ హెచ్చరించారు. మీతో పాటు తాము కూడా నిజనిర్దారణకు వస్తామని దేవినేని ఉమా ఎలా దోచుకున్నాడో తెలుస్తామని ఆయన తెలిపారు.
ఒక్క ఉమానే కాదని రాష్ట్రం మొత్తం ఇసుక నుంచి అన్నీ దోచుకున్నారని జోగీ రమేశ్ ఆరోపించారు. మా వాళ్ళు దళితులను దూషించి తప్పు చేశారని చంద్రబాబు పశ్చాత్తాపం చెందుతారని అనుకున్నామని కానీ ఆయనలో ఏ మార్పు రాలేదని జోగీ రమేశ్ ధ్వజమెత్తారు. మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమను గుండెల్లో పెట్టుకున్నారని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అంతా జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తారని రమేశ్ చెప్పారు.