వాళ్లను చూస్తుంటే బాధేస్తోంది.. పవన్ కళ్యాణ్
ఈ సదస్సుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, మాజీ వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల నాయకులను ఆహ్వానించి చర్చలు ఏర్పాటు చేస్తామన్నారు.
రైతే రాజు అంటాం.. అలాంటి రైతులు రకరకాల పంటలు వేసి గిట్టుబాటు, మద్దతు ధరలేక ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తే బాధకలిగిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయ నాయకుల ఇళ్లల్లో వేల కోట్లు మూలుగుతున్నాయి గానీ రైతులకు మాత్రం కనీసం గిట్టుబాటు ధర ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ మనకు కనిపించే దేవుడు రైతు అని పవన్ పేర్కొన్నారు. దాదాపు అన్ని పంటల రైతు సమస్యలపై సంపూర్ణ అవగాహన కోసం అక్టోబర్ 14 తర్వాత వారం రోజులపాటు వ్యవసాయ సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సదస్సుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, మాజీ వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల నాయకులను ఆహ్వానించి చర్చలు ఏర్పాటు చేస్తామన్నారు.
ఆదివారం జంగారెడ్డి గూడెం రాజారాణి ఫంక్షన్ హాల్ లో రైతులు, రైతు సంఘాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. పలువురు పామాయిల్, పొగాకు రైతులు జనసేన అధినేత ముందు తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రాకముందు తాను కూడా రైతునే అని అన్నారు.
‘‘ రైతులకు ఒళ్లు ఎంత హునం అవుతుందో నాకు తెలుసు. రైతు సమస్యలను విజన్ డాక్యుమెంట్ లో ప్రస్తావించకోవడానికి కారణం వారి సమస్యలపై ఇంకా లోతైన అవగాహన కోసమే. కష్టమంటే తెలియనివాళ్లు, సమస్యలపై అవగాహన లేనివాళ్లు రాజకీయాల్లోకి వెళ్లి వేలకోట్లు సంపాదిస్తున్నారు. చేసిన పనికి లాభం లేనప్పుడు వ్యవసాయం ఎందుకు చేయాలి.. అని కొందరు రైతులు తనను అడుగుతున్నారు. పంచించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రతి పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చేసి రైతలుకు జనసేన అండగా ఉంటుంది. వ్యవసాయం లాభసాటి కావాలంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ని అర్థం చేసుకోవాలి’’ అని పవన్ పేర్కొన్నారు.