చంద్రబాబు వ్యాఖ్యలను తిప్పికొట్టిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై చేసిన విమర్శలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిప్పికొట్టారు
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై చేసిన విమర్శలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిప్పికొట్టారు. ఉత్తరాంధ్ర ప్రజలను తాను రెచ్చగొడుతున్నానని చంద్రబాబు అంటున్నారని, రెచ్చగొట్టేవాడినైతే చంద్రబాబుకు ఎందుకు మద్దతిస్తానని ఆయన అన్నారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయన తన పోరాట యాత్రలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కొందరు రాజకీయ నేతల చేతుల్లో ఉత్తరాంధ్ర నలిగిపోతుందని అన్నారు. గత ఎన్నికల్లో 70 సీట్లకు పోటీ చేద్దామని తాను అనుకున్నానని, అనుభవం ఉందనే ఉద్దేశంతోనే తాను గత ఎన్నికల్లో మోడీకి, చంద్రబాబుకు మద్దతిచ్చానని అన్నారు. టీడీపి అవినీతికి చీపురుపల్లి మాంగనీసు గనులే నిదర్శనమని అన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఇసుక మాఫియాను ప్రోత్సహించడానికి పనికి వచ్చిందని ఆయన అన్నారు.
ఇసుక రవాణా ఉచితమని చెప్పి అవినీతికి చట్టబద్ధత కల్పించారని ఆయన విమర్శించారు. ఇసుక మాఫియాను అరికట్టకపోతే 2050 నాటికి నదులు ఉండవని అన్నారు. రాష్ట్ర విభజన అన్యాయంగా జరిగిందని, తెలంగాణకు ఆస్తులూ ఆంధ్రకు అప్పులు వచ్చాయని ఆయన అన్నారు.
అధికార దాహంతో టీడీపీ నేతలు కనిపించిన ప్రతి దాన్ీ కబ్జా చేస్తూ అక్రమ మైనింగ్, ఇసుక మాఫియాతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. అధికార పార్టీ నేతలకు దోచుకోవడం తప్ప వేరే వ్యాపకం లేదని వ్యాఖ్యానించారు. జనసేన ప్రజా పోరాటయాత్రలో భాగంగా గజపతినగరంలో శుక్రవారం సాయంత్రం జరిగిన సభలో మాట్లాడారు.
పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా సీఎం నివాసం ఏర్పరచుకున్నారని, చంద్రబాబు నివాసాలకు రూ.కోట్లు ఖర్చు పెడుతూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేస్తున్నారని ఆయన అన్నారు.