సీఎం జగన్కు పోలీసును కొట్టిన ఘనత ఉంది.. బాబాయిని చంపేసి కేసును సీబీఐకి అప్పగించమనడమేంటి?: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని విడగొతామంటే తోలు తీసి కూర్చోబెడతామని హెచ్చరించారు. వైసీపీ నాయకులతో జనాలు విసిగిపోయారని మండిపడ్డారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిగిలో జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జనసేన కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తన సనాతన ధర్మాన్ని తాను పాటిస్తున్నప్పుడు దానిని విమర్శించే హక్కు ఎవరికి లేదన్నారు. అలా విమర్శిస్తున్నారంటే.. వారి అజెండాలు వేరే ఉన్నాయని విమర్శించారు.
సెక్యూలరిజమ్ పేరు మీద సనాతన ధర్మాన్ని చావగొట్టద్దని అన్నారు. హిందూ దేవతలను దూషణ చేయవద్దని కోరారు. ఈ మధ్య కాలంలో దూషణలు ఎక్కువ అయిపోతున్నాయి.. అలాంటి వ్యాఖ్యలు చేసేవారు మానుకోవాలని కోరారు. మహ్మద్ ప్రవక్తను, జీసెస్ను అనడానికి భయమేస్తుందని.. కానీ హిందూ దేవతలను వారికి ఎక్కడి నుంచి ధైర్యం వస్తుందని ప్రశ్నించారు. ఇది మాట్లాడినంతా మాత్రానా తాను రైట్ వింగ్ అయిపోనని అన్నారు. సెక్యూలరిజమ్ అని చెప్పి నోటికొచ్చినట్టుగా మాట్లాడటం తప్పని అన్నారు.
Also Read: ఏపీని విడగొడతామంటే తోలు తీసి కూర్చోబెడతాం.. ప్రజలు విసిగిపోయారు: పవన్ కల్యాణ్
‘‘మంత్రి ఇల్లు తగులబడిన సీఎం వెళ్లలేదు.. ఎందుకంటే వాళ్లు కావాలనే నిప్పు పెట్టించుకున్నారు. అందుకే ముఖ్యమంత్రి వెళ్లలేదు. బాబాయిని చంపేసి కేసును సీబీఐకి అప్పగించమనడమేంటి? కోడి కత్తితో గీకించుకుని ఏపీ పోలీసులపై నమ్మకం లేదనడమేటి?. ఏపీ డాక్టర్ల మీద నమ్మకం ఉండదు.. హైదరాబాద్ వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అధికారంలోకి వచ్చాక ఆ డాక్టర్ను ఆరోగ్య శ్రీ పథకంలో చైర్మన్ చేస్తారు. వైసీపీ ప్రజాప్రతినిధులు బాధ్యతరహితంగా ప్రవర్తిస్తున్నారు.. వాళ్ల మెడలు వంచి జవాబు చెప్పిస్తాం. పోలీసులు రోజు సెల్యూట్ చేసే ముఖ్యమంత్రికి.. వాళ్లంటే గౌరవం లేదు. ఆయన టీనేజ్లో ఉన్నప్పుడు పులివెందులలో ఒక పోలీసు అధికారిని జైలులో పెట్టి కొట్టిన ఘనత ఉంది. ఈరోజు అతని చేతిలో లా అండ్ ఆర్డర్ ఉంది’’ సీఎం జగన్ టార్గెట్గా పవన్ విమర్శల వర్షం కురిపించారు.
‘‘మా తాత, మా నాన్న ముఖ్యమంత్రులు కాదు’’ అని పవన్ అన్నారు. తాను ముఖ్యమంత్రి కావాలని కలలు కనడం లేదని అన్నారు. ప్రజలు అంగీకరిస్తేనే తాను ముఖ్యమంత్రిని అవుతానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందాలంటే.. రాజకీయ స్థిరత్వం ఉండాలని అన్నారు. తమను ప్రజలు అధికారంలో తీసుకొస్తే.. తాను కూలీ మాదిరిగా పనిచేస్తానని చెప్పారు.