చంద్రబాబు అలా అన్నారు, చూస్తూ ఊరుకోవాలా: పవన్ కల్యాణ్
ఉత్తరాంధ్ర ప్రజలను తాను రెచ్చగొడుతున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటున్నారని, మీరు ఇసుక దోపిడీ చేస్తుంటూ చూస్తూ ఊరుకోవాలా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.
విజయనగరం: ఉత్తరాంధ్ర ప్రజలను తాను రెచ్చగొడుతున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటున్నారని, మీరు ఇసుక దోపిడీ చేస్తుంటూ చూస్తూ ఊరుకోవాలా అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. చోడవరం బహిరంగ సభలో ఆయన మంగళవారం మాట్లాడారు.
ప్రజారాజ్యం ద్వారా నెరవేరని లక్ష్యాలను సాధించడానికే తాను జనసేన పార్టీని స్థాపించినట్లు ఆయన తెలిపారు. జనసైనికులు హక్కుల కోసం పోరాడాలని, పారిపోకూడదని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా సమస్యలను పట్టించుకునే పరిస్థితిలో లేరని ఆయన విమర్శించారు.
రాష్ట్ర విభజన సమయంలో ఉత్తరాంధ్రకు కావాల్సిన అంశాలను ఏ నాయకుడు కూడా ప్రస్తావించలేదని ఆయన అన్నారు. తాను కోరుకున్నది జవాబుదారీతనంతో కూడిన రాజకీయమని చెప్పారు. టీడీపి, వైసిపి నేతలు విశాఖ భూములను కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన విమర్శించారు.