తనను ముఖ్యమంత్రిని చేస్తేనే సమస్యలు పరిష్కరిస్తానని  వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లా చెప్పడానికి తాను రాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాను ప్రజలకు అండగా నిలబడటానికి వచ్చానని అన్నారు. చంద్రబాబులా తనను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన ప్రజలను కోరారు.  

ఏలూరు: తనను ముఖ్యమంత్రిని చేస్తేనే సమస్యలు పరిష్కరిస్తానని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లా చెప్పడానికి తాను రాలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాను ప్రజలకు అండగా నిలబడటానికి వచ్చానని అన్నారు. చంద్రబాబులా తనను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన ప్రజలను కోరారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అధికారం సాధించటానికి ప్రశ్నించడమనేది మొదటి అంకమని, తాను ఐదేళ్లు ఉండి వెళ్ళటానికి రాజకీయాల్లోకి రాలేదని ఆయన అన్నారు. 

ప్రధాని నరేంద్ర మోడీ తనకు మిత్రుడేమీ కారని, బంధువు కూడా కాదని పవన్ కల్యాణ్ అన్నారు. టీడీపీ, వైసీపీ దోపిడీలు చూశామని ఆయన అన్నారు. తాను కులాన్ని నమ్ముకున్న వ్యక్తిని కాదన్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లాకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో టీడీపీ ప్రభుత్వం చెప్పాలని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. 13 జిల్లాల్లో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లానే టీడీపీకి 15 ఎమ్మెల్యే సీట్లను కట్టబెట్టిందని, కానీ జిల్లాకి టీడీపీ చేసిందేమీ లేదని విమర్శించారు.

చంద్రబాబు అనుభవం పశ్చిమగోదావరి జిల్లాకు ఏమాత్రం పనికి రాలేదని అన్నారు. పశ్చిమలో 15 సీట్లు గెలవకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారా, లోకేష్ మంత్రై మన నెత్తిన ఎక్కేవారా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

అరవై ఏళ్ళ క్రితం పూర్తి కావాల్సిన వశిష్ట వారధికి ఈ రోజుకీ దిక్కులేదని అన్నారు. టీడీపీ పాలనలో కాపు కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ అన్నీ అవినీతిమయంగా తయారయ్యాయని విమర్శించారు. 

మహిళా అధికారుల మీద దాడి చేసిన ఎమ్మెల్యేలపై చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా నిరుద్యోగ సమస్యే ఉందని అన్నారు. 


రాష్ట్ర ప్రజలు చంద్రబాబు, జగన్ కుటుంబాల మధ్య నలిగిపోతున్నారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. టీడీపీకి అండగా నిలబడిన బీసీలు, కాపులకు ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆయన అన్నారు.