48 గంటల్లో హెల్త్ మినిస్టర్ ని నియమించకుంటే నిరాహారదీక్షకు దిగుతా : పవన్ కళ్యాణ్
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి పవన్ హెచ్చరిక
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో బాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలను పట్టించుకునే నాధుడే రాష్ట్రంలో లేకుండా పోయాడని విమర్శించారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకోడానికి, ఆరోగ్య శాఖ ను పర్యవేక్షించడానికి హెల్త్ మినిస్టర్ లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం 48 గంటల్లో హెల్త్ మినిస్టర్ ను నియమించకుంటే యాత్రను ఆపేసి నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. పలాసలో ఇవాళ ఉదయం కిడ్నీ బాధితులతో సమావేశమైన పవన్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఉద్దానం కిడ్నీ సమస్యకు పరిష్కారం దొరికే వరకు బాధితులకు తాను అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చారు. బాధితుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, అయితే తాను అనుకున్నంతగా సమస్య పరిష్కారం కాలేదని పవన్ అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి నిరాహార దీక్షకు దిగడానికైని సిద్దమేనని పవన్ బాధితులకు భరోసా ఇచ్చారు.
బాధితులకు ఆదుకోవడం కోసం అన్ని రాజీయ పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టాలని, చిత్తశుద్దితో పరిష్కారాన్ని ఆలోచించాలని పవన్ సూచించారు. ప్రభుత్వం కూడా ఎపిలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సూచించారు. ప్రజల కన్నీళ్లు తుడవని అధికారం ఎందుకని పవన్ ప్రశ్నించారు. ఇదే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ హెల్త్ సెంటర్ల లో కూడా ప్రజలకు వైద్యం సరిగ్గా అందడం లేదని పవన్ అన్నారు.
ఉద్దనం కిడ్నీ బాధితులకు అండగా నిలబడుతున్న డాక్టర్లకు, జనసేన కార్యకర్తలకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో హెల్త్ మినిస్టర్ లేడు కాబట్టి హెల్త్ సెక్రటరీ అయినా ఈ విషయంపై స్పందించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.