ఫ్యాన్ ను చితకబాదిన పవన్ కల్యాణ్ బౌన్సర్లు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానిని ఆయన బౌన్సర్లు చితకబాదారు.
శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానిని ఆయన బౌన్సర్లు చితకబాదారు. సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పలాసకు చెందిన ఓ కార్యకర్త తాను పవన్ కల్యాణ్ ను చూడనిదే బయటకు వెళ్లనని పట్టుబట్టాడు. దాంతో అతడిని నలుగురు బౌన్సర్లు చితకబాదారు. కార్యకర్తలను గేటు వద్ద కాపుకాసిన బౌన్సర్లు అడ్డుకున్నారు.
జనసేన కార్యకర్తలను బౌన్సర్లు కాశీబుగ్గలో చితకబాదినట్లు ఆరోపణలు వచ్చాయి. పవన్ కల్యాణ్ ఇచ్ఛాపురం యాత్ర ముగించుకుని కాశీబుగ్గ టీకేఆర్ కల్యాణ మంటపానికి మధ్యాహ్నం చేరుకున్నారు. కార్యకర్తలు పవన్ కల్యాణ్ ను చూసేందుకు ఎగబడడంతో వారిని చెదరగొట్టేందుకు బౌన్సర్లు తన చేతికి పని కల్పించారు.
శ్రీకాకుళం జిల్లాలో యాత్ర సందర్భంగా తమ నేత పవన్ కల్యాణ్కు జరగకూడనిది ఏదైనా జరిగితే జిల్లా ఎస్పీ, కాశీబుగ్గ పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని జనసేన మీడియా ఇన్చార్జి పి.హరిప్రసాద్, ఉపాధ్యక్షుడు బి.మహేంద్రరెడ్డి, కోశాధికారి ఎం.రాఘవయ్య హెచ్చరించారు.
ఇచ్ఛాపురం పర్యటనలో భారీస్థాయిలో ప్రజలు, అభిమానులు వచ్చారని, ఒకరిద్దరు పోలీసులతో రక్షణ ఇచ్చారే తప్ప వీఐపీ భద్రత కల్పించలేదని అన్నారు. మంగళవారం పలాస రోడ్షోకు కూడా అనుమతివ్వలేదని, దీనికి నిరసనగా మంగళవారం సాయంత్రం 4గంటలకు నిరసన కవాతు నిర్వహిస్తున్నామని వారు చెప్పారు.