మందడం గ్రామానికి వెళ్లకుండా పవన్ కళ్యాణ్‌ను పోలీసులు అడ్డుకొన్నారు. ఈ సమయంలో  పోలీసులపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 


అమరావతి: తాను కూడ పోలీసు కొడుకునేనని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పోలీసులకు చెప్పారు. తనకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రోడ్లపై ముళ్లకంచెలను ఎందుకు వేశారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మందడం వెళ్లే సమయంలో నాలుగు చోట్ల రోడ్లపై బైఠాయించి పవన్ కళ్యాణ్ పోలీసుల తీరుపై మండిపడ్డారు.

Also read:కాల్చుకొంటే కాల్చండి: అడ్డుకొన్న పోలీసులపై పవన్ ఫైర్

 రాజధాని రైతులకు మద్దతుగా నిలిచేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కలుసుకొనే కార్యక్రమానికి పోలీసులు అడ్డు తగిలారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెం గ్రామాల రైతులతో మాట్లాడిన తర్వాత మందడం వైపుకు పవన్ కళ్యాణ్ వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా అడ్డు తగిలారు.

సీఎం జగన్ సచివాలయంలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని పోలీసులు పవన్ కళ్యాణ్‌కు అడ్డుపడ్డారు. సీఎం సచివాలయం నుండి వెళ్లిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ను తుళ్లూరు వెళ్లాలని పోలీసులు సూచించారు.

Also read:జగన్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు: పవన్

సీఎం వైఎస్ జగన్ సచివాలయం నుండి వెళ్లిపోయిన తర్వాత మందడం గ్రామానికి వెళ్లాలని పోలీసులు పవన్ కళ్యాణ్‌కు సూచించారు. అయితే మందడం గ్రామానికి పవన్ కళ్యాణ్ వెళ్లకుండా వెంకటపాలెం వద్ద పోలీసులు అడ్డుకొన్నారు. రోడ్డుపై ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. మందడం -వెంకటపాలెం గ్రామాల మధ్య రోడ్డుపైనా నాలుగు చోట్ల పవన్ కళ్యాణ్ బైఠాయించారు.

రోడ్లపై పోలీసులు వేసిన ముళ్లకంచెను మందడం గ్రామస్తులు తొలగించారు.ఈ క్రమంలో ముళ్లకంచెలో కొందరు గ్రామస్థులు పడి గాయపడ్డారు. ఈ క్రమంలోనే ముళ్ల కంచెను దాటుకొని పవన్ కళ్యాణ్ మందడం వైపుకు వెళ్లారు.

ఈ క్రమంలోనే పోలీసులు పదే పదే ఆయనను అడ్డుకోవడంతో పవన్ కళ్యాణ్ తీవ్ర అసహానానికి గురయ్యారు. తాను కూడ పోలీసు కొడుకునే అని ఒకానొక దశలో తేల్చి చెప్పారు. ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 


.