నెల రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోతే దీక్ష: పవన్
తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయకపోతే దీక్ష: పవన్ హెచ్చరిక
విశాఖ: నెలరోజుల్లో విశాఖ జిల్లాలోని తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించకపోతే దీక్ష చేస్తానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మంగళవారం నాడు పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లాలో మూతపడిన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించారు.
ఈ సందర్భంగా విశాఖ జిల్లా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు, రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఫ్యాక్టరీ మూతపడేందుకు దారి తీసిన పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకొన్నారు. తాను అనకాపల్లిలో పర్యటిస్తున్నానని తెలిసిన తర్వాత షుగర్ ఫ్యాక్టరీ విషయమై ప్రభుత్వం సమీక్ష నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు.
నెల రోజుల్లో ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే తాను దీక్ష చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విశాఖలో రైల్వేజోన్ విషయమై ఎంపీ ఆవంతి శ్రీనివాస్ జోనూ లేదు గీనూ లేదని చేసిన కామెంట్స్ను ఆయన ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు తనకు చాలా బాధ కల్గించాయని ఆయన చెప్పారు.షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నిధికి పార్టీ నుండి నిధులను సమకూర్చనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.