రాజకీయాల్లో అలాంటి నాయకుడు ఒక్కరూ లేరు: పవన్ ఆవేదన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోరాటాలను తట్టుకునే నాయకుడు ఒక్కరూ లేకుండా పోయారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విజయవాడ జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కడప జిల్లా నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించిన పవన్ పార్టీ శ్రేణులకి దిశానిర్ధేశం చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోరాటాలను తట్టుకునే నాయకుడు ఒక్కరూ లేకుండా పోయారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విజయవాడ జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కడప జిల్లా నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించిన పవన్ పార్టీ శ్రేణులకి దిశానిర్ధేశం చేశారు.
రాష్ట్ర విభజన కోసం ఒకవైపు విపరీతమైన పోరాటం జరుగుతుంటే ఆ పోరాటం తాలూక ఒత్తిడిని తట్టుకునే నాయకుడు మన రాష్ట్రంలో లేకుండా పోయారన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ లాంటి నాయకులు ఎలాంటి ఒత్తిడిని అయినా తట్టుకునేవారన్నారు. ఆమెకు ఉన్న రాజకీయ సంకల్పం బలం అలాంటింది అంటూ కొనియాడారు పవన్.
ఇందిరా గాంధీపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తన సిద్ధాంతానికి అనుగుణంగా రాష్ట్రాన్ని విభజించేందుకు ముందుకు రాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి నేతలు మనుకు ఇప్పుడు కనుమరుగైపోయారన్నారు.
90వ దశకం చివరిలోనే తెలంగాణ భావజాలం బలపడడాన్ని తాను గమనించినట్లు తెలిపారు.
ముఖ్యంగా యువతలో ఈ కోరిక బలంగా ఉందన్నారు. ఆ కోరికే మార్పుకి సంకేతంగా తాను భావించినట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ-ఆంధ్ర ప్రాంతాలు సాంస్కృతికంగా సమ్మిళితం కాలేకపోయాయని చెప్పుకొచ్చారు. ఇది కూడా వేర్పాటు బీజాల అంకురార్పణకి కారణమన్నారు.
ఒకప్పుడు తెలంగాణలో ఎలాంటి భావజాలం వచ్చిందో ప్రస్తుతం రాయలసీమలో కూడా అలాంటి పరిస్థితే నెలకొందన్నారు. ఈ అంశంపై ఆలోచించకపోతే భవిష్యత్ లో ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయన్నారు. ఇలాంటి మార్పులను గమనించే తాను జనసేన పార్టీని స్థాపించినట్లు తెలిపారు.