జనసేనలోకి మాజీ ఐఏఎస్ అధికారి
కీలక బాధ్యతలు చేపట్టిన తోట చంద్రశేఖర్
సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు చేరారు. ఆయనకు పవన్ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనే తోట చంద్రశేఖర్. గుంటూరు జిల్లాకు చెందిన ఈయన గతంలో మహారాష్ట్రలో ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి పీఆర్పీలో చేరారు. ఆయన్ను పీఆర్పీ గుంటూరు లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దించింది. అప్పట్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఆపరాజయం తరువాత చంద్రశేఖర్ కొంత కాలం పాటు రాజకీయలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. పవన్.. జనసేన పార్టీ స్థాపించడంతో.. తిరిగి వైసీపీని వదిలి.. జనసేనానిగా మారారు.
చంద్రశేఖర్ నియామకం అనంతరం పవన్ మాట్లాడుతూ..తోట చంద్రశేఖర్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. చంద్రశేఖర్తో గత పదేళ్లుగా తనకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందని, ఆయన మంచి పరిపాలకుడే కాకుండా విజయవంతమైన పారిశ్రామికవేత్త అని పవన్ తెలిపారు. పౌర పరిపాలనలో ఆయనకున్న పట్టు, శక్తి సామర్థ్యాలు అపారమైనవన్నారు. ఆయన దీక్షాదక్షత జనసేన పార్టీని మరింత విస్తృతపరచడానికి ఉపయోగపడుతుందని తాను, జనసేన పార్టీ ముఖ్యమైన ప్రతినిధులు గట్టిగా విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా త్వరలో చంద్రశేఖర్ ప్రమాణస్వీకారం చేస్తారని పవన్ ప్రకటించారు. పార్టీ ప్రమాణాన్ని ఆచరించి, బాధ్యతలను స్వీకరిస్తారన్నారు. చంద్రశేఖర్కు పార్టీ శ్రేణులు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తాయని ఆశిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు