ఎన్టీఆర్ విగ్రహాలకు ముసుగు వేయండి.. పవన్ కామెంట్స్
ఎమ్మెల్యే బాలకృష్ణ అలగాజనం, సంకరజాతి అంటూ తనని కించపరుస్తున్నారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకొని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకి ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హత లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా లో పర్యటిస్తున్న పవన్..చంద్రబాబు, బాలకృష్ణ లపై మండిపడ్డారు.
చంద్రబాబు తనకు కులాన్ని ఆపాదిస్తూ దగుల్భాజీ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక ఎమ్మెల్యే బాలకృష్ణ అలగాజనం, సంకరజాతి అంటూ తనని కించపరుస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే.. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ పేరు చెప్పకుండా ఎన్నికలకు వెళ్లాలన్నారు.
రాహుల్ గాంధీ కాళ్లుపట్టుకున్న చంద్రబాబుకి ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హత లేదని, ఎన్టీఆర్ విగ్రహాలకు ముసుగులు వేసి అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. నైతికత విషయంలో తాను అందరికన్నా ఉన్నతంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.
అవసరమైతే ఓడిపోవడానికి సిద్ధమే గానీ... తన ఐడియాలజీ మార్చుకోనని పవన్ పేర్కొన్నారు. తనకు ప్రతి ఒక్కరి జీవితాలు తెలుసని, అందరి జీవితాలు బయటపెట్టగలని హెచ్చరించారు. తనను, తన తల్లిని తిట్టడానికే కార్యక్రమాలు చేస్తున్నారని, అధికారంలో చంద్రబాబు, విపక్షంలో జగన్ ఫెయిల్ అయ్యారని పవన్ ఆరోపించారు.