తాడిపత్రిలో కరపత్రాల కలకలం.. చర్చకు సిద్దంగా ఉన్నానని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రకటన..
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మరోసారి కరపత్రాలు కలకలం సృష్టించాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి వ్యతిరేకంగా గుర్తుతెలియని వ్యక్తులు కరపత్రాలు పంపిణీ చేశారు.
అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మరోసారి కరపత్రాలు కలకలం సృష్టించాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మూడో విడత ప్రజా సంక్షేమ యాత్ర నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే గన్నెవారిపల్లి కాలనీలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే ఈ క్రమంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డికి వ్యతిరేకంగా కరపత్రాలు దర్శనమివ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తులు ఈ కరపత్రాలను పంపిణీ చేశారు. అందులో ‘‘రోజూ జేసీ సోదరులను తలచుకోకుంటే నీకు నిద్ర పట్టదు పెద్దారెడ్డి’’ అని ప్రశ్నించారు. దోచుకోవడం గురించి ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాట్లాడితే బాగుండదని.. ప్రజల కోసం ఏం చేశారనేది చెప్పుకునేందుకు ఆయన చేసింది ఏమి లేదని విమర్శించారు.
అయితే ఈ క్రమంలోనే కరపత్రాలు పంపిణీకి సంబంధించి ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్పందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ప్రత్యర్థుల ఆలోచన అని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో వారు గెలవరనే భావించి.. ఇలాంటి పనులు చేస్తున్నారని విమర్శించారు. కరపత్రాల రాజకీయాలు మానుకోవాలని గతంలో కూడా తాను చెప్పానని అన్నారు. నియోజకవర్గంలో అభివృద్దికి సంబంధించి చర్చకు తాను సిద్దమని ప్రకటించారు.
మరోవైపు కరపత్రాల పంపిణీకి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.