ఎందరో గొప్ప రాజులకు, కాకలు తీరిన నేతలకు , చారిత్రక సంఘటనలకు విజయనగరం కేంద్రం. ఇక్కడి నుంచి ఎందరో నాయకులు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. పూసపాటి వంశీయులదే విజయనగరంలో ఆధిపత్యం. విజయరామ గజపతి రాజు, అశోక్ గజపతిరాజులు ఇక్కడ విజయాలు సాధిస్తూ వచ్చారు. అశోక్ గజపతి రాజు 1978లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎదురు లేకుండా సాగుతున్నారు. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టీడీపీ ఏడు సార్లు, కాంగ్రెస్ , సోషలిస్ట్ పార్టీలు రెండు సార్లు, ప్రజా సోషలిస్ట్ పార్టీ, భారతీయ జనసంఘ్, జనతా పార్టీ, ఇండిపెండెంట్, వైసీపీ ఒక్కోసారి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వీరభద్రస్వామికి మరోసారి టికెట్ కేటాయించారు జగన్ . తన కుమార్తె అదితి విజయలక్ష్మీ గజపతిరాజుకు టికెట్ తెప్పించుకున్న అశోక్ ఆమెను గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.