Asianet News TeluguAsianet News Telugu

జగన్ ప్రభుత్వ జమా ఖర్చులపై పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం జమాఖర్చులపై పిఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ జమాఖర్చులపై ఆయన గవర్నర్ బిశ్వభూషణ్ కు ఫిర్యాదు చేశారు.

PAC chairman Payyavula Keshav slams YS Jagan government
Author
Amaravati, First Published Jul 8, 2021, 6:51 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ జమాఖర్చులపై పీఎసి చైర్మన్ పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు.  ప్రభుత్వ జమాఖర్చుల నిర్వహణపై ఆయన గురువారం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు.  నలబై వేల కోట్ల రూపాయలకు సరైన లెక్కలు లేవని గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్లామని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయడి ఆదేశాల మేరకు గవర్నర్ ను కలిసి ఆర్థిక శాఖలోని లోపభూయిస్టాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, ప్రైవేటు వ్యవస్థను నడపడానికి ఏవిధంగా అకౌంటింగ్ ప్రాసెస్ వుంటుందో..రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడానికి కూడా జమా ఖర్చులను ఏ నివేదికలో రూపొందించాలనే విధివిధానాలను దేశంలోని ప్రభుత్వాలు రూపొందించుకున్నాయని ఆయన చెప్పారు. 

బ్రిటిషు వారి నుండి వచ్చిన సంప్రదాయాలను మరింత మెరుగుపరచి అకౌంటింగ్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వానికి  ఏర్పాటు చేశారని, లక్షల కోట్ల రూపాయలు లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో  అవతవకలు జరిగితే పట్టుకోవడానికి విధానాలను ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రూ.41 వేల కోట్ల జమా ఖర్చులను సరిగ్గా నమోదు చేయలేదన్న అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, తాము చేసేది ఆరోపణలు కాదు.. చాలా రోజులుగా సమాచారాన్ని సేకరించి చెప్తున్నామని ఆయన చెప్పారు. 

రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని గోప్యంగా ఉంచుతోందని, ప్రభుత్వ ఉద్యోగి చిన్న ఖర్చు చేయాలన్నా ఓచర్ రాసి, పది మంది సంతకాలు పెట్టాలని, ఆ తర్వాతే జిల్లా ట్రెజరర్ విడుదల చేస్తారని ఆయన చెప్పారు. ప్రభుత్వ అధికారికి జీతం రావాలన్నా వంద సంతకాలు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని, అలాంటిది.. రూ.41 వేల కోట్లకు పైగా ఎలాంటి బిల్లులు, ఓచర్లు, లావాదేవీల పత్రాలు లేకుండానే నచ్చిన విధంగా వేరే పద్దుల్లోకి మార్చారని పయ్యావుల కేశవ్ అన్నారు. 

తాము ఆరోపణలు చేయడం లేదుని, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ రాసిన లేఖను కూడా జతపరిచి ఫిర్యాదు చేశామని, వారి రాసిన లేఖ ప్రకారం రూ.41 వేల కోట్లకు సంబంధించి సరైన పద్దులు లేవని, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలాగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.

బడ్డీ కొట్లు కూడా పద్దులు రాసుకుంటాయని, అలాంటిది రూ.41 వేల కోట్లకు పద్దులు రాయలేదంటే ఏం సమాధానం చెప్తారని పయ్యావుల అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేసే ప్రతి చర్య కూడా గవర్నర్ పేరు మీదే జరుగుతుందని, ఆ నిబంధనను కూడా గవర్నర్ కు ఇచ్చిన లేఖలో పొందుపరిచామని ఆయన చెప్పారు. ఆర్టికల్ 151(2) ప్రకారం సీఐజీ వాళ్లు గవర్నర్ ఇస్తే గవర్నర్ శాసనసభకు పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం ఏ నివేదికలు ఇస్తే గవర్నర్ ఆవే నివేదికలు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుందని పయ్యావుల అన్నారు. 

శాసన సభను నిదుల మంజూరు చేయాలని మంత్రులు అడుగుతారని, కానీ ఏడాదికి కూడా అకౌంట్స్ వివరాలు తెలపడం లేదని అన్నారు. తెలిసి చేస్తున్నారా? లేక అధికారులు చేస్తున్నారా అన్న విషయం ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో సీఎం డ్యాష్ బోర్డు చదివితే రాష్ట్రంలో జరిగే సమాచారం మొత్తం తెలిసేదని, ఇప్పుడు ఏ సమాచారం కూడా లభించడం లేదని, ఒక ఎమ్మెల్యే లేఖ రాసినా ఏడాది వరకు స్పందించనటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. 

రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించే విధంగా కాగ్ ద్వారా పూర్తి స్థాయిలో సమీక్ష చేయాలని గవర్నర్ ను కోరినట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు. కాగ్, రాష్ట్రానికి వుండే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ప్రతి ఏడాది లేదా రెండేళ్లకు పూర్తి స్థాయిలో అకౌంటెంట్ నిర్వహిస్తారని, గతంలోనూ జలయజ్ణం, తర్వాత ప్రభుత్వంలో ఇరిగేషన్ మీద అకౌంటెంట్ చేశారని, రాష్ట్ర ఆర్థిక శాఖ మీద పూర్తిస్థాయి ఆడిట్ జరగాలని గవర్నర్ ను కోరామని ఆయన అన్నారు. 

దీన్ని పరిశీలించి గవర్నర్ న్యాయం చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. రూ.41 వేల కోట్లను తేలిక చేసే అంశం కాదని, ఒక శాఖకు సంబంధించి మొత్తం వ్యవహారమే జమా పద్దుల, కావాల్సిన నిబంధనలు ట్రెజరీ నిబంధనల ప్రకారం లేకుండా జరిగాయని, దానికి సాక్ష్యాదారాలతో పాటు కాగ్ రాసిన లేఖను గవర్నర్ కు ఇచ్చామని వివరించారు. అకౌంట్ రూల్ ప్రకారం జరగకపోతే పట్టుకోవడం కష్టంగా వుంటుందని ఆయన చెప్పారు. అములు చేయాల్సిన అధికారులు ఉల్లంఘిస్తే భవిష్యత్ లో క్షేత్ర స్థాయిలో జరిగే అవకతవకలు ఏ విధంగా నియంత్రించగలగుతారని ఆయన ప్రశ్నించారు. 

ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, ఇవన్నీ శాసన సభ అనుమతితో జరగాలని ఆయన అన్నారు. శాసన సభ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవరం వుందని అన్నారు. గవర్నర్ ఈ విషయాలను బయటకు తెస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. రూ.41 వేల కోట్లు ఖర్చు అయ్యాయి..కానీ ఓచర్లు లేవు. మీ దగ్గర రసీదులు ఉంటే చూపించండి. రూ.41 వేల కోట్లు మీరు తినేశారని మేము అనడం లేదని అన్నారు.  రికార్డుల్లో లేవా? మరో కార్యాలయం ఏమైనా నడుస్తోందా? రికార్డుల్లోకి తేవలేదా.? ఆడిట్ వాళ్లు వచ్చినప్పుడు చూపించలేదా అని ఆయన ప్రశ్నించారు. లేదా దానికి సంబంధించిన రసీదులు వుంటే చూపించండి. రూ.41 వేల కోట్లను ప్రొసీజర్సుకు సంబంధించి రసీదులు, సిగ్నేచర్స్ గానీ కనిపించడం లేదని ఆయన అన్నారు. 

వాస్తవ చర్చలు జరిగితే చాలా విషయాలు బయటకు వస్తాయని,  ఇంతకు ముందు ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అనేది పకడ్బందీగా వుండేవని, కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఆర్థిక మంత్రికైనా చూపిస్తున్నారో లేదోనని పయ్యావుల కేశవ్ అన్నారు. ఆర్థిక కార్యదర్శులకు మాత్రమే పాస్ వార్డ్ యాక్సెస్ వుందని, మరి కేంద్ర, బ్యాంకుల నుండి డబ్బుల తీసుకురావాలంటే కావాలనే చేసి వుండొచ్చునని ఆయన అన్నారు ఉద్దేశంగా చేసి వుండొచ్చుునని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios