Asianet News TeluguAsianet News Telugu

ఉల్లి కొరతపై జగన్ సంచలన నిర్ణయం...బోర్డర్లు సీజ్‌: మంత్రి కన్నబాబు

రాష్ట్రంలో నెలకొన్న ఉల్లి కొరతపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే చర్యలు కూడా ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. 

onion crisis  in andhra pradesh... ys jangan sensational decision
Author
Amaravathi, First Published Dec 10, 2019, 5:20 PM IST

అమరావతి: ప్రతిపక్ష పార్టీలు ఏదో ఒక అవకాశం కోసం ఎదురుచూస్తూ కేవలం రాజకీయాలు చేయటడానికే ప్రాధాన్యతనిస్తున్నాయని...ప్రజల సమస్యలను వారికసలు చిత్తశుద్దే లేదని మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మొన్న ఇసుక సమస్య అంటూ ఇసుక ప్యాకెట్లు, దండలు వేసుకొని రోడ్డు మీదకు వచ్చారని గుర్తుచేసిన మంత్రి సోమవారం కూడా అలాగే ఉల్లిపాయ దండలు వేసుకొని అసెంబ్లీకి వచ్చారని అన్నారు. అంతటితో ఆగకుండా చాలాసేపు గొడవ చేసి సభ సక్రమంగా జరక్కుండా అడ్డుకున్నారని మంత్రి ఆరోపించారు. 

గుడివాడలో వినియోగదారుడు ఉల్లిపాయల కోసం వెళ్లి చనిపోలేదని... వేరే కారణాలతో చనిపోయారని మృతుని కుటుంబ సభ్యులు రోడ్డు మీదకు వచ్చి చెప్పడం మీడియాలో చూశానని కన్నబాబు చెప్పారు. సోమవారం అంతా సభను ఆపటానికి ప్రయత్నిస్తూ ఏదో సంఘటన జరిగితే దాన్ని దీనికి లింక్‌ చేశారని...ఇలా మహిళల భద్రతపై చాలా కీలకమైన చర్చను ప్రక్కదారి పట్టించారని మంత్రి మండిపడ్డారు. 

వ్యవసాయ శాఖామంత్రిగా రెండు విషయాలు సభ దృష్టికి తీసుకువస్తున్నానని కన్నబాబు తెలిపారు. మొదటిది మార్కెట్‌ ఇంటర్వెన్ష్‌ సంబంధించింది అయితే రెండోది వైయస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకమని ఆయన తెలిపారు.  ముఖ్యమంత్రి జగన్‌ వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేసి మిషన్‌ దాని ఛైర్మన్‌గా ప్రతినెలా సమావేశాన్ని నిర్వహిస్తున్నారని కన్నబాబు అన్నారు. 

ప్రతి వ్యవసాయ మిషన్‌ మీటింగ్‌లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ మీద ఫస్ట్‌ ఐటం అజెండాగా సీఎం రివ్యూ చేస్తున్నారని తెలిపారు. వచ్చే మూడు నెలల తర్వాత ఏ  సమస్యలు రాబోతున్నాయి... ఆ ఛాలెంజ్‌ ఎదుర్కోవటానికి మన దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటని సీఎం సమీక్షిస్తున్నారని తెలిపారు.  కేవలం ఉల్లిపాయలే కాదు.. ఉల్లితో పాటు కాటన్‌ ఇతర పంటలు సమీక్షిస్తున్నారని వివరించారు. 

read more నాకో న్యాయం...వల్లభనేని వంశీకో న్యాయమా: ప్రశ్నించిన టిడిపి ఎమ్మెల్యే

నాలుగు నెలల క్రితమే ఉల్లిపై సమీక్షించారన్నారు. ఉల్లి వేసే సమయానికి వర్షాభావం, పంట తీసే సమయానికి వర్షాలు వచ్చి మహారాష్ట్ర, ఏపీలో పంట ఉత్పత్తి తగ్గిపోయి ఉల్లి కొరత ఏర్పడిందన్నారు దీనివల్ల రైతుకు నష్టపోయే సమయంలో, వినియోగదారుడుపై భారం పడే సమయంలో కాపాడాలని సీఎం గతంలోనే చెప్పారని పేర్కొన్నారు. 

జగన్‌ చెప్పినట్లే కిలో ఉల్లికి రూ.100లు సబ్సిడీ ఇచ్చి రైతు బజార్లో అమ్మిస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రమైన ఒక్క ఉల్లిపాయల మీద రూ.100లు సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో రూ.40-45లకు ఒక్క రైతు బజారులోనే అమ్ముతున్నారని కన్నబాబు తెలిపారు. ఏపీలో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉల్లిపాయలు అమ్ముతున్నారని వివరాలు తెలిపారు. 

కొందరు ప్రతిపక్ష నాయకులు ఉల్లిపాయలు వాలంటీర్లతో ఇంటింటికీ ఎందుకు పంపించరని అడుగుతున్నారు. కోటిన్నర కుటుంబాలు ఉన్నాయి. కేజీ పంపించాలంటే దాదాపు 15వేల టన్నులు కావాలి. అస్సలు అంత ప్రొడక్షన్‌ దేశంలోనే ఉందా అని కన్నబాబు ప్రశ్నించారు. 

read more  వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడో...ఇక అంతే: చినరాజప్ప

''ఇంచుమించు రోజుకు 3వేల టన్నులు ఉల్లి అవసరం ఉంటుంది. అందుకనే మొన్న సమావేశంలో సీఎం కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం విజిలెన్స్‌ ఐజీని కూడా పిలిపించారు. కర్నూలు, తాడేపల్లి మనకు కీలకమైన మార్కెట్లు. ఈ మార్కెట్ల నుంచి వేరే రాష్ట్రాలకు ఉల్లి వెళ్లిపోకుండా బోర్డర్లు సీజ్‌ చేయమని సీఎం ఆదేశించారు. మన అవసరాలు తీరాక బయట విక్రయించుకోవాలని చెప్పారు. అవసరమైతే ఇక్కడే కొనుగోలు చేయాలని చెప్పారు.'' అని మంత్రి వివరించారు.   

చరిత్రలో మొదటిసారిగా మార్కెట్‌ నుంచి మార్కెట్ రేటుకు కొనుగోలు చేసిన ప్రభుత్వం లేదన్నారు. ఎప్పుడైనా రైతుల నుంచి కొనుగోలు చేశారు కానీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నది సీఎం జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వమే అని కన్నబాబు తెలిపారు. తాడేపల్లిగూడెం మార్కెట్‌ నుంచి ఉల్లిపాయలు సబ్సిడీ మీద అందించటానికి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. 

టమోటా రేటు పడిపోతే స్పాట్‌లోనే కొనుగోలు చేయించి వేరే మార్కెట్‌లకు పంపించి దళారులను అరికట్టిన చరిత్ర జగన్ కే దక్కుతుందని అన్నారు. రాజకీయాన్ని వ్యవసాయానికి, వినియోగదారులకు ముడిపెట్టడం భావ్యం కాదని హితవు పలికారు.

''మహిళా భద్రత, రక్షణ మీద మాట్లాడుతుంటే ఉల్లి గురించి మాట్లాడతారు. తీరాతేలింది ఏమిటి అంటే ఆ మరణం ఉల్లిపాయలకు సంబంధించినది కాదని. అసెంబ్లీ మొదటి రోజే అవకాశం దొరికిందని ఉల్లిపాయ దండలు వేసుకొని వచ్చారు. గతంలోనూ ఇసుక కొరత వచ్చిందని ఇసుక దండలు వేసుకొని కూర్చొన్నారు'' అంటూ ప్రతిపక్ష రాజకీయాలను మంత్రి ఎద్దేవా చేశారు. 

దేశంలో సమయానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌ మాత్రమేనని... వేరే రాష్ట్రంలో ఇంతకంటే ఎక్కువకు సబ్సిడీ ఇస్తున్నారేమో చెప్పండని ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నిస్తున్నానని అన్నారు. సరైన సమయంలో సీఎం గారు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిస్తున్నారన్నారు. సబ్సిడీ కింద ఉల్లిని రూ.25లకు అమ్మమని ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారా? అని ప్రశ్నించారు. దీన్ని ముందుగానే గుర్తించి జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని కన్నబాబు పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios