తూర్పుపాలెంలో ఓఎన్జీసీ పైప్లైన్ నుండి గ్యాస్ లీకేజీ:భయాందోళనలో స్థానికులు
విశాఖపట్నం విషవాయువు లీక్ దుర్ఘటనను మరిచిపోకముందే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుసగా గ్యాస్ లీక్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.
కాకినాడ: విశాఖపట్నం విషవాయువు లీక్ దుర్ఘటనను మరిచిపోకముందే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుసగా గ్యాస్ లీక్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.
ఈస్ట్ గోదావరి జిల్లా తూర్పుపాలెం వద్ద ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. తూర్పు పాలెం నుంచి మోరీ గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్కు వెళ్లే పైప్లైన్ పగిలిపోవడంతో భారీగా గ్యాస్ బయటకు వెలువడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఓఎన్జీసీ సిబ్బంది లీకైన గ్యాస్ను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే గ్యాస్ లీక్ కి గల కారణాలు తెలియరాలేదు.
ఓఎన్జీసీ పైప్ లైన్ల నుండి గ్యాస్ లీక్ కావడం తరచుగానే జరుగుతుంటాయి. గ్యాస్ లీకైన ఘటనపై ఓఎన్జీసీ సిబ్బందికి సమాచారం ఇచ్చినట్టుగా పోలీసులు తెలిపారు. 95 శాతం గ్యాస్ లీకేజీని తగ్గించినట్టుగా అధికారులు ప్రకటించారు.