దుర్గ గుడి హుండీలో చోరీ... కేసులో మరో ట్విస్ట్
దుర్గమ్మ కానుకల చోరీ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇటీవల అమ్మవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించే సమయంలో ఓ వ్యక్తి బంగారం, నగదు చోరీ చేసిన సంగతి తెలిసిందే.
దుర్గమ్మ కానుకల చోరీ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇటీవల అమ్మవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించే సమయంలో ఓ వ్యక్తి బంగారం, నగదు చోరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆలయ ఉద్యోగి సింహాచలంతో పాటు అతడి భార్య దుర్గను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా హుండీలోని కానుకలతో పాటు, రూ. 10 వేల నగదును తీసుకున్న సింహాచలం వాటిని సంచిలో వేసుకున్నట్లు సీసీటీవీలో రికార్డయింది. అయితే ఈ కేసులో మరో ఇద్దరికి కూడా ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.చోరీ చేసిన అనంతరం కొండ దిగువకు వచ్చే క్రమంలో సింహాచలం.. దుర్గారావు వ్యక్తికి కొంత నగదు ఇవ్వడం, ఆ తర్వాత అతడు నేరుగా ప్రసాదం కౌంటర్ దగ్గరకు వెళ్లడం సీసీటీవీలో కనిపించింది.
ఈ నేపథ్యంలో సింహాచలం రెండో భార్య రమణకు ఇచ్చేందుకే నగదు అపహరించినట్లుగా పోలీసులు భావించడంతో వారిద్దరిని కూడా అరెస్టు చేశారు. కాగా ఈ వ్యవహారంలో ఆలయ సిబ్బందితో పాటు సెక్యూరిటీ అధికారులపై కూడా ఆలయ ఈవో కోటేశ్వరమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కేసుతో సంబంధం ఉన్న అధికారులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో దుర్గగుడిలో నిఘాను మరింత పటిష్టం చేస్తామని కోటేశ్వరమ్మ తెలిపారు. హుండీల లెక్కింపు సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.