మరోసారి అవకాశమిస్తే సైబరాబాద్ లాంటి నగరం నిర్మించేవాళ్లం: ఓటమిపై చంద్రబాబు
మరోఐదేళ్లపాటు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా సైబరాబాద్ లాంటి నగరం నిర్మించేవాళ్లమని స్పష్టం చేశారు. అమరావతిలోని తన నివాసంలో కుప్పం నియోజకవర్గం నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. కుప్పంలో మెజార్టీ తగ్గడానికి గల కారణాలపై ఆరా తీశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటమిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మరోఐదేళ్లపాటు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా సైబరాబాద్ లాంటి నగరం నిర్మించేవాళ్లమని స్పష్టం చేశారు.
అమరావతిలోని తన నివాసంలో కుప్పం నియోజకవర్గం నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. కుప్పంలో మెజార్టీ తగ్గడానికి గల కారణాలపై ఆరా తీశారు. గతంలో 70వేలు మెజారిటీ వస్తే ఈసారి 30 వేలే వచ్చిందని ఎందుకు తగ్గిందో కారణాలను తెలుసుకోవాలని కోరారు.
హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం శివారు వరకూ నీళ్లు తెచ్చామని ఎందుకు మెజారిటీ తగ్గిందో అన్వేషించాలని టీడీపీ నేతలకు ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలు అనంతరం కుప్పంలో పర్యటిస్తానని స్పష్టం చేశారు.
కుప్పంలో పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తానని చెప్పుకొచ్చారు. జరిగింది వదిలేసి భవిష్యత్తు వైపు నడవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పోరాటం టీడీపీకే కొత్తేమీ కాదన్న చంద్రబాబు పలాయనం తెలియకుండా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
మనం తప్పు చేయలేదు. ధైర్యంగా ముందుకెళ్దాం అంటూ కార్యకర్తల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. టీడీపీ నేతలంతా గతం మరిచి భవిష్యత్తు వైపు నడవాలని సూచించారు. చిన్నచిన్న లోపాలను సవరించుకుని భవిష్యత్ కోసం ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ఒత్తిడి తేవాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు.