చినబాబు.. ఐటి హడావుడి
ముందస్తు ఎన్నికల సంకేతాలు వెలువడుతున్న నేపధ్యంలో కొత్తగా చినబాబు విజయవాడ కేంద్రంగా ఐటి రంగభివృద్ధి గురించి మాట్లాడుతుండటం గమనార్హం.. ఇదెంత కాలమో చూడాలి.
చినబాబు నారాలోకేష్ ఐటి హడావుడి మొదలైంది. ఇంతకాలం చంద్రబాబునాయుడు హడావుడి చూసాం. ఇకనుండి లోకేష్ హడావుడిని చూస్తాం. తాజాగా విజయవాడ మేధాటవర్స్ లో 7 ఐటి కంపెనీలను ఐటి, పంచాయితీ రాజ్ శాఖల మంత్రి, చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ ప్రారంభించారు. ఐటి రంగంలో 2లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ లోకేష్ నానా హంగామా చేస్తున్నారు.
విశాఖపట్నాన్ని ఐటి రంగానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుపుతామంటూ ఆమధ్య చంద్రబాబు ఎన్నో వాగ్దానాలు చేసారు. హటాత్తుగా వచ్చిన హుద్ హుద్ తుఫాను మొత్తం విశాఖ నగరాన్ని తుడిచి పెట్టేయటంతో ఆలోచనను మార్చుకున్నట్లుంది. ఐటి రంగానికి విశాఖపట్నం ఏంతమాత్రం సేఫ్ కాదనుకున్నారో ఏమో తెలీదు. తర్వాత తిరుపతి చుట్టు పక్కల ప్రాంతాల్లో ఐటి రంగానికి ఊపు తెస్తామని చెప్పారు. దానికి తోడు తిరుపతిలో ఇన్ క్యుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా హడావుడి జరిగింది. అదేమైందో తెలీదు.
ప్రస్తుతానికి విజయవాడ కేంద్రంగా ఐటి హడావుడి మొదలైంది. రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్రకు కేంద్రంగా విశాఖపట్నాన్ని, రాయలసీమలో కేంద్రంగా తిరుపతిని ఐటి రంగంలో బాగా అభివృద్ధి చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇపుడు అసలు ఆ మాటలే మాట్లాడటం లేదు.
తాజాగా ముందస్తు ఎన్నికల సంకేతాలు వెలువడుతున్న నేపధ్యంలో కొత్తగా చినబాబు విజయవాడ కేంద్రంగా ఐటి రంగభివృద్ధి గురించి మాట్లాడుతుండటం గమనార్హం.. ఇదెంత కాలమో చూడాలి.