చల్లబడిన జేసీ దివాకర్ రెడ్డి: అధికారులు ఏం చేశారంటే?
రెండు రోజులుగా ఉద్రిక్తంగా ఉన్న అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం సోమవారం సాయంత్రానికి చల్లబడింది
తాడిపత్రి: రెండు రోజులుగా ఉద్రిక్తంగా ఉన్న అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం సోమవారం సాయంత్రానికి చల్లబడింది. వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రబోధానందస్వామి ఆశ్రమ వర్గీయులకు చిన్నపొడమల గ్రామస్తులకు గొడవ జరిగింది తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఏ క్షణాన్నైనా ఆక్టోపస్ దళాలు ఆశ్రయంలోకి చొచ్చుకుపోవచ్చునన్న ఉద్రిక్తత మధ్యాహ్నం దాకా కొనసాగింది. అయి తే, అనంతపురం జిల్లా ఎస్పీ అశోక్కుమార్, కలెక్టర్ వీరపాండ్యన్ ఆశ్రమంలోకి ప్రవేశించి జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి.
దీంతో ఇటు ఆశ్రమంలోని శిష్యులు తమ స్వస్థలాలకు వెళ్లడానికి అంగీకరించగా, అటు ఇదే అంశంపై పోలీస్స్టేషన్లో నిరసన తెలుపుతున్న ఎంపీ జేసీ దివాకర్రెడ్డి తన ఆందోళనను విరమించారు.
ప్రబోధానంద ఆశ్రమంలోని శిష్యులను అధికారులు బస్సుల్లో వారి స్వస్థలాలకు తరలించారు. ఈ విషయం తెలుసుకొన్న జేసీ.. 24 గంటలుగా సాగిస్తున్న తన నిరసనను విరమించారు. శిష్యుల తరలింపు సమయంలో ఘర్షణలు జరగకుండా పోలీసులు మోహరించారు.
ఓ డీఐజీ, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం జిల్లాల ఎస్పీలు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ముందు జాగ్రత్తగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ను అమరావతి నుంచి రప్పించారు. ఇంకోవైపు నుంచి అనంతపురం జిల్లా ఎస్పీ, కలెక్టర్ శాంతి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వారిద్దరినే తమ ఆశ్రమంలోకి నిర్వాహకులు అనుమతించారు.
న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటామని కలెక్టర్, ఎస్పీలు స్పష్టమైన హామీ ఇచ్చారు. సేఫ్ ప్యాకేజీ ఇవ్వడంతో స్వస్థలాలకు వెళ్లేందుకు శిష్యులు అంగీకరించారు. స్థానికంగా ఆధార్కార్డు ఉన్నవారు తప్ప మిగిలిన వారందరినీ తరలించారు. నిర్వాహకులతో పాటు 50 మందినే ఆశ్రమంలో ఉండేందుకు అనుమతించారు.
ఈ వార్తలు చదవండి
జేసీ దివాకర్ రెడ్డికి బాబు ఫోన్: న్యాయ విచారణ చేయిస్తామని హామీ
ఆశ్రమంపై చర్యలు తీసుకోండి.. రాత్రంతా పోలీస్ స్టేషన్ ముందే కూర్చొన్న జేసీ
చిన్నపొడమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ముందు జేసీ ధర్నా
గణేష్ నిమజ్జనంతో చిన్నపొడమలలో ఉద్రిక్తత: జేసీ దివాకర్ రెడ్డి నిరసన