పవన్ కల్యాణ్ భద్రతపై అయోమయం లేదు: డిజీపి
పవన్ కల్యాణ్ భద్రతపై ఏ విధమైన అయోమయం లేదని ఆంధ్రప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) మాలకొండయ్య స్పష్టం చేశారు.
అమరావతి: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ భద్రతపై ఏ విధమైన అయోమయం లేదని ఆంధ్రప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) మాలకొండయ్య స్పష్టం చేశారు. గురువారం అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
జిల్లాల ఎస్పీలతో జనసేన స్థానిక నేతలు మాట్లాడితే భద్రతా చర్యలు తీసుకుంటారని, ఇందులో ఎటువంటి అయోమయాలకు తావులేదని ఆయన అన్నారు.
పవన్ కల్యాణ్ కు భద్రత లేదని జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. తనపై దాడికి కొన్ని మూకలు ప్రయత్నిస్తున్నాయని పవన్ కల్యాణ్ స్వయంగా అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ భద్రత కోసం ఇద్దరు గన్ మన్ లను ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది.
అగ్రిగోల్డ్ కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని, అవ్వాస్ రామారావు కీలక నిందితుడనిని డీజీపీ మాలకొండయ అన్నారు. ఏవోబీలో ఇటీవల జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే ఉండవచ్చన్నారు. ఆర్కే వ్యక్తిగత గన్మెన్ చనిపోవడాన్ని బట్టి ఈ విషయాన్ని నిర్ధారించామని ఆయన అన్నారు.