Asianet News TeluguAsianet News Telugu

ఆఫీసులు మార్చడం కాదు...వికేంద్రీకరణ అంటే అదీ: నిమ్మకాయల

రాష్ట్ర రాజధాని విషయంలో  ప్రజా బ్యాలెట్ జరిపే ధైర్యం సజ్జలకుందా? అని మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. 

nimmakayala chinarajappa challange to sajjala ramakrishna reddy
Author
Amaravathi, First Published Jul 21, 2020, 1:07 PM IST

అమరావతి: రాష్ట్ర రాజధాని విషయంలో  ప్రజా బ్యాలెట్ జరిపే ధైర్యం సజ్జలకుందా? అని మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. రాజధాని పేరుతో ఆఫీసులు మార్చడం వికేంద్రీకరణ కాదని... స్థానిక సంస్థలకు నిధులు, విధులు బదలాయింపే వికేంద్రీకరణ అని నిమ్మకాయల వెల్లడించారు. 

''ప్రభుత్వ సలహారుల నియామకాలు ఎందుకని కేంద్రీకృతం చేశారు? వైకాపా తప్ప అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నా ఎందుకు విశాఖ. భూకబ్జాల కొసమే విశాఖ వైపు అడుగులు కాదా?'' అని నిమ్మల ఆరోపించారు. 

''రాజధానిపై ప్రభుత్వ నిర్ణయం హైకోర్టు ధిక్కరణే. విభజన చట్టం చేసిన పార్లమెంట్ ధిక్కరణ కూడా.  ప్రజాభిప్రాయ ధిక్కరణకు కూడా జగన్ సర్కార్ పాల్పడుతోంది. శివరామకృష్ణన్ నివేదికలో విజయవాడ-గుంటూరుకు మొదటి స్థానం కాదా?'' అని అడిగారు. 

''రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కరోనా నివారణను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఇలాంటి విపత్కర సమయంలో జగన్ రెడ్డి బృందం రాజధాని మార్పుకు చొంగ కారుస్తున్నారు'' అని మండిపడ్డారు. 

read more   అప్పుడూ, ఇప్పుడూ...రాష్ట్రపతి సంతకంతోనే అది సాధ్యం: సజ్జలకు యనమల కౌంటర్

''ప్రతిపక్షాలపై దాడులతో సమయం వృధా చేస్తున్నారు. దళితులు, బీసీలపై దాడులు చేస్తున్నారు. ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాలను బాపట్ల, కావలిలో తొలగించారు. సెంటు ఇంటి పట్టా పేరుతో వందల కోట్లు అవినీతి చేస్తున్నారు. ఇవి కప్పిపెట్టుకోవడానికి, విశాఖలో సొంత లాభం కోసం అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారు. సామాజిక వర్గం కోసమే చంద్రబాబు లేఖలు రాశారని కుల ప్రాంతీయ చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''అమరావతినందలి 29 గ్రామాలలోని 15 పంచాయతీల్లో బొత్సా సత్యనారాయణ సామాజికవర్గమే అధికంగా ఉంది. విజయవాడ, గుంటూరు నగరాలలో అగ్రవర్ణాలలో కాపులే అధికంగా ఉన్నారు. బొత్స సొంత ప్రయోజనం కోసం సామాజిక వర్గ ప్రయోజనాన్ని తాకట్టు పెట్టారు. అమరావతికి సింహద్వారమైన తాడేపల్లి మున్సిపాలిటీలో జగన్ మోహన్ రెడ్డి సామాజిక వర్గం ఆస్తులే అధికం. అమరావతికి పశ్చిమాన, దక్షిణాన ఉన్న జిల్లాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి సామాజిక వర్గమే అధికం. విశాఖ వారికి దూరం. పైగా విశాఖలో తక్కువ సంఖ్యలో ఉన్నారు. జగన్, విజయసాయిరెడ్డిలు సొంత ప్రయోజనాల కోసమే విశాఖ వెళ్తున్నారు. తమ సామాజిక వర్గాన్ని నష్ట పరచి వారి వ్యక్తిగత లబ్దికే జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి లు విశాఖ వైపు చేస్తున్నారు'' అని ఆరోపించారు.     

''చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారు అమరావతికన్నా విశాఖలోనే అధికంగా ఉన్నారు. కావున అధిక లబ్ది కలిగే అవకాశం ఉంది. అయినా చంద్రబాబు అన్ని జిల్లాల, అన్ని వర్గాల భవిష్యత్ కోసమే అమరావతిని రాజధానిగా నిర్మించారు. ప్రభుత్వ ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు గా అమరావతిని ప్లాన్ చేశారు. అమరావతి 6 ఎస్సి నియోజకవర్గాల మధ్య ఉంది. అమరావతిని నాశనం చేస్తే ఎక్కువగా నష్టపోయేది దళితులే'' అని పేర్కొన్నారు. 

''అమరావతి రాజధానికి ముఖద్వారమైన మంగళగిరి మున్సిపాలిటీలో బీసీలు అధికంగా ఉన్నారు. విజయవాడ, గుంటూరు నగరాలలో బ్రాహ్మణ, వైశ్య, ముస్లిం, క్రిష్టియన్ జనాభా కూడా గణనీయంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతి కులాల, మతాల కాస్మాపాలిటన్ రాజధాని. ఒక సామాజిక వర్గమేనని వైకాపా అబద్దాలు ప్రచారం చేస్తోంది. ఇలా కుల, ప్రాంతీయ చిచ్చు పెడుతోంది. రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు, అన్ని పార్టీల నిర్ణయాలకు విరుద్ధంగా, హైకోర్టు ధిక్కరణకు, విభజన చట్టం చేసిన పార్లమెంట్ ధిక్కరణ చర్యలను జగన్ మానుకోవాలి. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు'' అని నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. 
  
 

Follow Us:
Download App:
  • android
  • ios