రైతుల్ని ఒప్పించే భూముల్ని తీసుకున్నారు.. ఆర్కేది తప్పుడు కేసు: బాబుకు రఘురామ బాసట
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. గురువారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై ప్లాన్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని ఆయన ఆరోపించారు
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. గురువారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై ప్లాన్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని ఆయన ఆరోపించారు.
ఏపీలో జగన్ రాజ్యాంగం నడుస్తోందని రఘురామ ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం రైతులను ఒప్పించి రాజధానికి భూములు తీసుకుందని ఎంపీ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందంటూ తప్పుడు కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏమైనా ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారా? అని రఘురామ ప్రశ్నించారు. 75కి 74 మున్సిపల్ చైర్మన్లు వచ్చినా ఆనందం లేదా అంటూ రఘురామ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read:ఆ ఆధారాలన్ని సీఐడికి అందించా...: ఆళ్ల రామకృష్ణారెడ్డి
వైసీపీ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఎన్నికలే అవసరం లేదనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. నందిగం సురేష్, రెడ్డప్పలతో ఎవరో మాట్లాడిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు.
అలాగే లోక్సభలో తాను పలు విషయాలను ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశానని రఘురామకృష్ణరాజు తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయానికి మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నానని తెలిపారు. అలాగే, తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న నర్సాపురం లోక్సభ నియోజక వర్గంలో తనపై పెట్టిన అక్రమ కేసుల గురించి ప్రస్తావించానని ఎంపీ వివరించారు.