పార్టీ నుండి బహిష్కరించారేమో: నర్సాపురం రఘురామకృష్ణంరాజు
వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును పార్టీ నండి బహిష్కరించినట్టుగా ఆయనే భావిస్తున్నారు.
న్యూఢిల్లీ: వైసీపీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును పార్టీ నండి బహిష్కరించినట్టుగా ఆయనే భావిస్తున్నారు.
పార్టీ ఎంపీలతో సోమవారం నాడు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు తొలుత ఎస్ఎంస్ ద్వారా సమాచారం అందింది. అయితే ఆ తర్వాత ఏపీ భవన్ అధికారులు ఆయనకు ఫోన్ చేసి సమావేశానికి రావొద్దని సూచించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు వెల్లడించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో రఘురామకృష్ణంరాజు సహా వైసీపీ ఎంపీలకు పార్టీ నుండి సమాచారం అందింది.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీలకు ఇవాళ ఉదయం వైసీపీ చీఫ్, ఏపీ సీఎం వైఎస్ జగన్ దిశా నిర్ధేశం చేశారు. అయితే ఈ సమాచారం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కూడ చేరింది.
ఈ విషయం తెలుసుకొన్న వైసీపీ నాయకత్వం వెంటనే పొరపాటును సరిదిద్దుకొంది. ఈ సమావేశానికి రఘురామకృష్ణంరాజు హాజరుకాకుండా ఉండేందుకు గాను ఏపీ భవన్ ఉద్యోగి నుండి సమాచారం పంపారు. ఈ సమావేశానికి హాజరు కావొద్దని తనకు సమాచారం పంపారని రఘురామకృష్ణంరాజు మీడియాకు చెప్పారు.
ఈ విషయమై తనకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరారు. తనను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టుగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. అయితే పార్టీ విప్ ఇస్తే తాను పాటించాల్సిన బాధ్యత ఉంటుందన్నారు. ఈ విషయమై న్యాయ నిపుణులతో మాట్లాడి నిర్ణయం తీసుకొంటానని రఘురామకృష్ణంరాజు ప్రకటించారు.