కర్నూల్ జిల్లాకు చెందిన టిడిపి కార్యకర్తతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్న స్థానిక పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ నారా లోకేష్ జిల్లా ఎస్పీకి లేఖ రాశారు.
కర్నూలు జిల్లా కల్లూరు మండలం మార్కాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రామాంజనేయులు పట్ల స్థానిక పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీకి లోకేష్ ఓ లేఖ రాశారు.
''స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో టీడీపీ కార్యకర్త రామాంజనేయులు పట్ల పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. పోలీసు స్టేషన్లలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల గురించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు ఈ ఘటన అద్దంపడుతోంది. ఒక సాధారణ కుటుంబాన్ని దురుద్దేశంతో లక్ష్యంగా చేసుకొని పోలీసులు వేధించటం సరికాదు. పోలీసులు పెట్టే తప్పుడు కేసులు ఎదుర్కోవడం సామాన్యులకు శిక్షగా మారుతోంది'' అని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
read more జగన్కు జైలా.. బెయిలా, సస్పెన్స్కు పడని తెర.. తీర్పు మరోసారి వాయిదా
''వైసిపి ప్రయోజనాల కోసం పోలీసుల అసలు విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. బెయిల్ కు అవకాశం లేని సెక్షన్లు నమోదు చేయడం, కుటుంబాలను బెదిరించడం, జీవనోపాధి దెబ్బతీయడం కోసం పోలీసులు పనిచేయటం సరికాదు. కొందరు పోలీసులు తమ ప్రాథమిక విధులు నిర్వహించడంల విఫలమవుతూ అధికారంలో ఉన్నవారి చేతిలో సాధనంగా మారుతున్నారు'' అని ఆరోపించారు.
''అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేకుంటే ప్రజాక్షేత్రంలోనే తప్పులు ఎండగడతాం. మనమంతా రాజ్యాంగానికి సమాధానం చెప్పాలి కానీ అధికార పార్టీ నాయకులకు కాదని గుర్తించాలి'' అని ఎస్పీకి రాసిన లేఖలో లోకేష్ పేర్కొన్నారు.
