విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖ పర్యటన వాయిదాపడింది. 

విశాఖపట్నం: అనస్తీషియన్‌ డాక్టర్ సుధాకర్ ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి ఇవాళ(ఆదివారం) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ నేడు విశాఖకు వెళ్లాలని నిర్ణయించారు. సీతమ్మధారలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించాల్సి వుంది. అయితే లోకేష్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో ఇవాళ్టి పర్యటన వాయిదాపడింది. రేపు(సోమవారం) డాక్టర్ సుధాకర్‌ కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించనున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నర్సీపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ పేరు నిరుడు కరోనా తొలి దశ సమయంలో వెలుగులోకి వచ్చింది. ఆయన వైద్య సిబ్బందికి మాస్కులు లేవంటూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా వ్యాఖ్యానించి సస్పెండయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులకే విశాఖపట్నం జాతీయ రహదారిపై గొడవ చేస్తున్నారంటూ ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఈ వ్యవహారం కోర్టుకూ చేరింది. కొద్దిరోజుల పాటు మానసిక వైద్యశాలలో చికిత్స తీసుకుని డిశ్చార్జి అయ్యారు.

read more డాక్టర్ సుధాకర్ మరణం... జగన్ రాజీనామాకు అచ్చెన్న డిమాండ్

ఆయన రెండేళ్లు నర్సీపట్నంలో వైద్యుడిగా సేవలందించారు. కరోనా మొదటి దశ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో నర్సీపట్నం పురపాలక కార్యాలయంలో ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ నిర్వహిస్తున్న సమీక్ష సమావేశానికి తనంత తానుగా ఆయన వచ్చారు. సమావేశ మందిరంలోకి వెళ్లి తిరిగి బయటకు వచ్చిన తరవాత ఆయన ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యులకు ఎన్‌-95 మాస్కులు ఇవ్వడం లేదని.. ఒకటి ఇచ్చి పదిహేను రోజులు వాడుకోమని చెబుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. దీనిపై అధికారులు విచారణ నిర్వహించి ప్రాథమిక చర్యలకు సిఫార్సు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా మాట్లాడారనే ఆరోపణపై ఆయనను సస్పెండ్‌ చేశారు. 

అప్పటి నుంచి ఆయన విధులకు దూరమై విశాఖలోనే ఉంటున్నారు. తదుపరి ఓ ఘటనలో విశాఖలో ఆయనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరు సంచలనమైంది. డాక్టర్‌ సుధాకర్‌పై కక్షకట్టినట్టు వ్యవహరించడాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా అనేకమంది వ్యతిరేకించారు. సుధాకర్‌పై కొద్దిరోజుల క్రితమే నర్సీపట్నంలో శాఖాపరమైన విచారణ జరిగింది. దానికి ఆయన స్వయంగా హాజరై అధికారుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 

అధికారులకు అన్ని విషయాలను వివరించానని, త్వరలోనే విధుల్లోకి తీసుకుంటారన్న ఆశాభావం విలేకరుల వద్ద వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు చేయడమే తనకు ఇష్టమని, ఎవరినీ కించపరిచే ఉద్దేశాలు లేవని చెప్పారు. రేపో, మాపో సుధాకర్‌ విధుల్లోకి వస్తారని పలువురు ఎదురు చూస్తున్న సమయంలో ఆయన మరణించారు.