శవాలపై పేలాలను ఏరుకునేవారినీ జగన్ రెడ్డి తలదన్నుతున్నాడు: లోకేష్ ఫైర్
2020లో ఆమోదం పొందని దిశ చట్టం కోసం అప్పుడే ఆరంభించిన యాప్కే మరోసారి డౌన్ లోడ్ కార్యక్రమమా? అంటూ సీఎం జగన్ చర్యలను లోకేష్ ఎద్దేవా చేశారు.
అమరావతి: కరోనా బాధితుల డిమాండ్ల సాధనకు టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్ష నుండి ప్రజలను పక్కదారి పట్టించేందుకే సీఎం జగన్ దిశ యాప్ పేరిట హడావుడి చేస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. 2020లో ఆమోదం పొందని దిశ చట్టం కోసం అప్పుడే ఆరంభించిన యాప్కే మరోసారి డౌన్ లోడ్ కార్యక్రమమా? అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు.
శవాలపై పేలాలు ఏరుకునేవారిని తలదన్నుతూ అత్యాచారాలపైనా కోట్లు దండుకుంటున్నారు జగన్రెడ్డి. తన ఇంటి పక్కనే గ్యాంగ్ రేప్ జరిగి 10 రోజులవుతున్నా నిందితుల్ని పట్టుకోని జగన్రెడ్డి ప్రభుత్వం..దిశ యాప్ డౌన్లోడ్ నెపంతో సొంత పత్రికకు కోట్ల రూపాయల ప్రకటనలిచ్చారు'' అని లోకేష్ మండిపడ్డారు.
read more కరోనాతో బాధితులకు పరిహారం: టీడీపీ చీఫ్ చంద్రబాబు నిరసన దీక్ష
''సొంత అక్కాచెల్లెళ్లు షర్మిల, సునీతలకే భద్రతలేక ఒకరు తెలంగాణలో, ఇంకొకరు పోలీసుల చుట్టూ తిరుగుతుంటే.. ``అక్కచెల్లెమ్మల భద్రత-జగనన్న ప్రభుత్వ బాధ్యత`` అంటూ ఎందుకీ కపట ప్రకటనలు జగన్రెడ్డీ! మీ ఇంటి పక్కనే గ్యాంగ్ రేప్ జరిగితే, నిందితుడూ మీ ఇంటిచుట్టూ తిరుగుతుంటే పట్టుకోలేని చేతగాని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి'' అని జగన్ పై లోకేష్ మండిపడ్డారు.
కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి సచివాలయంలో నిర్వహించిన దిశ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాప్ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్వయంగా వివరించారు. ఇదే సమయంలో మరోవైపు కరోనా బాధితులను ఆదుకోవాలంటూ టిడిపి సాధన దీక్ష చేపట్టింది.