Asianet News TeluguAsianet News Telugu

ప‌రిశ్ర‌మ‌ చంద్ర‌బాబుది... ప్ర‌చారం జ‌గ‌న్‌ది... సొమ్మొక‌డిది సోకొక‌డిది: లోకేష్ సీరియస్

నానా క‌ష్టాలు ప‌డి రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయించింది చంద్ర‌బాబు అయితే నిస్సిగ్గుగా తామే తెచ్చామ‌ని ప్ర‌క‌టించుకున్న జ‌గ‌న్‌రెడ్డి మరోసారి ఫేక్ సీఎం అనిపించుకున్నార‌న్నారు నారా లోకేష్.  

nara lokesh reacts on ycp released industrial development in two years akp
Author
Amaravati, First Published Jun 10, 2021, 9:32 AM IST

అమరావతి: న‌వ్యాంధ్ర ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు దేశ‌విదేశాలు తిరిగి, ప్ర‌ఖ్యాత సంస్థలను ఒప్పించి తెప్పించిన ప‌రిశ్ర‌మ‌ల్ని జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో వ‌చ్చాయ‌ని డ‌ప్పు కొట్టుకోవ‌డం సిగ్గుచేట‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇది సొమ్మొక‌డిది సోకొక‌డిది అన్న చందాన వుందన్నారు. నానా క‌ష్టాలు ప‌డి రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయించింది చంద్ర‌బాబు అయితే నిస్సిగ్గుగా తామే తెచ్చామ‌ని ప్ర‌క‌టించుకున్న జ‌గ‌న్‌రెడ్డి మరోసారి ఫేక్ సీఎం అనిపించుకున్నార‌న్నారు. 

''జ‌గ‌న్‌రెడ్డి రెండేళ్ల అరాచ‌క‌ పాల‌న‌లో ఒక్క కంపెనీ రాక‌పోవ‌డంతో, చంద్ర‌బాబు తీసుకొచ్చిన కంపెనీలైన కియా, హీరో మోటార్స్, అశోక్ లేల్యాండ్, ఇసుజు, అపోలో టైర్స్, మోహన్ స్పిన్ టెక్స్, టోర్పీ, టిసిఎల్ తో పాటు మొత్తం 16 కంపెనీలు, సంస్థ‌లు తామే తెచ్చామ‌ని ప్ర‌క‌టించుకుని వైసీపీ స‌ర్కారు అభాసుపాలయ్యింది. తెలుగుదేశం  ప్రభుత్వ హయాంలో మూడు సార్లు పారిశ్రామిక సదస్సులు నిర్వహించి 15.45 లక్షల కోట్లరూపాయల పెట్టుబడులు, 32లక్షల  ఉద్యోగాలు కల్పించేవిధంగా ప్రణాళికలు రూపొందించాము. ఐదేళ్ల టిడిపి ప్ర‌భుత్వం కృషితో 5 ల‌క్ష‌ల 13 వేల ఉద్యోగాలు వ‌చ్చాయ‌ని జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారే శాస‌న‌మండ‌లి సాక్షిగా వెల్ల‌డించింద‌న్నారు'' అని గుర్తుచేశారు. 

ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు ఎన్నో క‌ష్టన‌ష్టాల‌కోర్చి తెచ్చిన పెట్టుబ‌డుల్ని జ‌గ‌న్‌రెడ్డి రెండేళ్ల అరాచ‌క‌పాల‌న‌తో  17లక్షల కోట్లరూపాయల విలువైన భారీ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వైసీపీ నేత‌ల బెదిరింపుల కారణంగా రూ.2వేల కోట్ల పెట్టుబడులతో వచ్చే 17 కియా అనుబంధ సంస్థలను ఇత‌ర రాష్ట్రాల‌లో ఏర్పాటు చేసుకుంటున్నార‌ని పేర్కొన్నారు. వేలాది మందికి ఉపాధి క‌ల్పిస్తోన్న కడపలోని జువారి సిమెంట్స్, చిత్తూరు జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ వంటి ప్రతిష్టాత్మక పారిశ్రామిక సంస్థలను పిసిబి నోటీసులతో మూసివేసే ప్రయత్నాలు చూశాక, కొత్త ప‌రిశ్ర‌మ‌లు స్థాపించేందుకు ఎవ‌రైనా ఏపీకొస్తారా? అని ప్ర‌శ్నించారు. 

read more  విశాఖలో పాఠశాల కూల్చివేత: వాళ్లంతా పేద విద్యార్ధులే, చంద్రబాబు ఆవేదన.. సీఎస్‌కు లేఖ

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం నేతల క్వారీలపై దాడులు చేసి భారీగా పెనాల్టీ వేసి గ్రానైట్ పరిశ్రమల సంక్షోభానికి కార‌ణ‌మ‌య్యార‌ని ఆరోపించారు. కంపెనీల‌కు రాయితీలు ఇవ్వాల్సిన ప్ర‌భుత్వ పెద్ద‌లే క‌మీష‌న్ల కోసం వేధించ‌డంతో రేణిగుంటలో రిలయన్స్‌ జియో రూ.15వేల కోట్ల పెట్టుబ‌డి, ఒంగోలులో రూ.24 వేల కోట్లతో ఏర్పాటు కావాల్సిన పేపర్‌ కంపెనీ, విశాఖలో రూ.70వేల కోట్ల పెట్టుబడికి సిద్ధమైన అదానీలు వెన‌క్కి త‌గ్గార‌ని ఆరోపించారు. రూ.50వేల కోట్ల పెట్టుబడులు వచ్చే సింగపూర్‌ స్టార్టప్‌ కంపెనీలు ఒప్పందాలను రద్దు చేసుకోవ‌డంతో విదేశాలలోనూ ఏపీ అప‌కీర్తి మూట‌క‌ట్టుకుందన్నారు. ఇలా పెట్టుబ‌డులు పెట్టాలంటేనే భ‌య‌ప‌డిపోయే ప‌రిస్థితి తీసుకొచ్చార‌ని మండిప‌డ్డారు. 

ఏపితో ఒప్పందం చేసుకుని కూడా హోలీ టెక్ కంపెనీని ఉత్తర్ ప్రదేశ్ వెళ్ళిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం జే ట్యాక్స్ వేధింపులేన‌న్నారు. ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్, హెచ్ ఎస్ బిసిల‌ను బెదిరించి మ‌రీ పంపేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వాకం కారణంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి రేటు  -2.58కి, జిఎస్డిపి -3.26కి పడిపోయింద‌ని, దేశం మొత్తంమీద సగటు నిరుద్యోగిత రేటు 11.9 ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 13.5కి చేరుకొంద‌న్నారు. 

జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం రెండేళ్ల‌లో తెచ్చిన కంపెనీలంటూ ఈ రోజు విడుద‌ల చేసిన జాబితా మొత్తం ఏపీ ప్ర‌జ‌లు ప‌రిశీలించాల‌ని నారా లోకేష్ కోరారు. ఈ కంపెనీల‌న్నీ 2015 నుంచి చంద్రబాబు తెచ్చిన‌వి, అప్పుడు ఒప్పందం మేర‌కు వ‌చ్చినవేన‌న్నారు. ఏ కంపెనీ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం విడుద‌ల చేసిన‌ అధికారిక డాక్యుమెంట్లతో సహా ప్ర‌జ‌ల‌  ముందు పెడుతున్నామ‌ని, ఎవ‌రు రాష్ట్రాభివృద్ధికి, పారిశ్రామికాభివృద్ధికి కృషి చేశారో నిర్ణ‌యించుకోవాల‌ని లోకేష్ కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios