ఒక్క చాన్స్ అదే చివరి చాన్స్... స్థానిక ఎన్నికల్లో ప్రజా తీర్పు: నారా లోకేష్
అధికార యంత్రాంగం, పోలీసుల్ని వాడుకుని వైసీపీ వాళ్లు హత్యలు చేస్తున్నారు, కిడ్నాప్లకు పాల్పడుతున్నారు, నామినేషన్ పత్రాలు చించేశారు, ఆస్తులు తగులబెట్టారు, ప్రలోభాలతో ఏకగ్రీవాలు చేసుకున్నారని లోకేష్ మండిపడ్డారు.
గుంటూరు: స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే జనంలో ఉన్న వ్యతిరేకత బయటపడుతుందని జగన్రెడ్డి రాజ్యాంగ వ్యవస్థలపై దాడికి తెగబడ్డారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. న్యాయస్థానాల చొరవతో స్థానిక ఎన్నికలు జరిగుతున్నాయని... అయితే .ఇక్కడా అధికార యంత్రాంగం, పోలీసుల్ని వాడుకుని వైసీపీ వాళ్లు హత్యలు చేస్తున్నారు, కిడ్నాప్లకు పాల్పడుతున్నారు, నామినేషన్ పత్రాలు చించేశారు, ఆస్తులు తగులబెట్టారు, ప్రలోభాలతో ఏకగ్రీవాలు చేసుకున్నారని లోకేష్ మండిపడ్డారు.
''అధికార పార్టీ ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా ఎదురొడ్డి నిలిచి గెలిచిన తెలుగుదేశం యోధులకు, కార్యకర్తలకు శిరసువంచి నమస్కరిస్తున్నాను. గాలి హామీలిచ్చి అధికారంలోకొచ్చిన ఫేక్ పార్టీకి ఒక్క చాన్స్ చివరి చాన్స్ అని ప్రజలు స్థానిక ఎన్నికల ద్వారా తీర్పునిచ్చారు. వైఎస్ జగన్రెడ్డి ఇంట్లో పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్పార్టీకి..జనం గుండెల్లోంచి పుట్టిన తెలుగుదేశం పార్టీతో పోలికా?'' అని లోకేష్ విమర్శించారు.
read more షర్మిల పెట్టిన ముహూర్తంలోనే... వైసిపి పతనానికి నాంది: దేవినేని ఉమ వ్యాఖ్యలు
''బలవంతపు ఏకగ్రీవాల కోసం అడ్డదారులు తొక్కుతున్న జగన్ రెడ్డి స్థానిక సమరంలో నైతికంగా ఒడిపోయినట్టే. బెదిరింపులకు బయపడి కొంతమంది, అధికార పార్టీకి తొత్తులుగా మారి మరికొంతమంది అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు'' అని లోకేష్ ట్వీట్ చేశారు.
''మాచర్ల రూరల్ మండలం, జమ్మలమడక గ్రామ కార్యదర్శి టిడిపి బలపర్చిన అభ్యర్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చట్టాల్ని గౌరవించకుండా ప్రలోభాలకు గురై తప్పులు చేస్తున్న కొంతమంది అధికారులు, తప్పుడు పనులు చేస్తూ బలవంతపు ఏకగ్రీవాలు చేస్తున్న వైకాపా నాయకులు మూల్యం చెల్లించుకోక తప్పదు'' అని లోకేష్ హెచ్చరించారు.