పవన్ కల్యాణ్ కు రాంగ్ ఫీడ్ బ్యాక్: నారా లోకేష్, జగన్ పై తీవ్రంగా..
ఉద్ధానం కిడ్నీ బాధితుల గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాంగ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చి ఉంటారని, అందుకే అలా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అన్నారు.
అమరావతి: ఉద్ధానం కిడ్నీ బాధితుల గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాంగ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చి ఉంటారని, అందుకే అలా మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యను ప్రభుత్వం దృ,ష్టికి తెచ్చిన వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఉద్ధానం కిడ్ని బాధితుల కోసం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని, అయితే ఇంకా చేయాల్సింది ఉందని ఆయన అన్నారు. బుధవారం ఆయన మహానాడు ఏర్పాట్లను పరిశీలించారు. తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం కొత్తేమీ కాదని అన్నారు. అన్ని పార్టీలనూ కలుస్తామని, రాష్ట్రానికి న్యాయం చేస్తామని ఆయన అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై ఆయన తీవ్రంగా స్పందించారు. బజారున పోయేవాళ్ల గురించి మాట్లాడాలా అని ఆయన అడిగారు. ఎ1, ఎ2లకు తాను సమాధానం చెప్పాలా అని ఆయన జగన్, విజయసాయిరెడ్డిలను ఉద్దేశించి అన్నారు. మోడీపై మాట్లాడే దమ్మూ ధైర్యమూ లేనివాళ్లు బిజెపితో కలిసి క్విడ్ ప్రోకో రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు.
తిరుమల వ్యవహారంపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగేవారు మాట్లాడడం విచిత్రమని ఆయన అన్నారు. తిరుమల ఆభరణాలను, విలువైన ప్రజాసంపదను సిబిఐ లోటస్ పాండ్, ఇడుపులపాయల్లో తవ్వకాలు జరిపి వెలికి తీస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.