Asianet News TeluguAsianet News Telugu

గ్రూప్ 1 పై ఏ1 రెడ్డి కన్ను... ఏపీపీఎస్సీని వైసిపిపీఎస్సీగా మార్చి అక్రమాలు..: లోకేష్ ఫైర్

కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవిత కు అనర్హం అన్నట్టు ఏ1 రెడ్డి గారి అవినీతికి ఇసుక, మద్యం ఆఖరికి గ్రూప్ 1 పరీక్షలు కాదేది అనర్హం అని ఆరోపించారు నారా లోకేష్. 

nara lokesh meeting with group1 candidates akp
Author
Amaravati, First Published Jun 10, 2021, 10:36 AM IST

అమరావతి: పాదయాత్రలో జగన్ రెడ్డి నేను విన్నాను...నేను ఉన్నాను అన్నారు... అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అన్నారు... ఇప్పుడు ఉద్యోగాలు లేవు కదా చివరికి ఉన్న కంపెనీలు కూడా పోతున్న పరిస్థితి వుందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. 

గ్రూప్-1 అభ్యర్థులతో జరిగిన చర్చా కార్యక్రమంలో లోకేష్ పొల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు హయాంలో విదేశీ పెట్టుబడుల ఆకర్షించడంలో రాష్ట్రం 3, 4 స్థానాల్లో ఉంటే జగన్ రెడ్డి పాలనలో పెద్ద రాష్ట్రాల జాబితాలో చివరి స్థానంలో ఉందన్నారు. ఏపీపీఎస్సీని గుండు సున్నా చేసారు, డిఎస్సి జీరో, పోలీస్ రిక్రూట్మెంట్ నిర్వీర్యం చేసారని మండిపడ్డారు. 

''ఇక గ్రూప్ 1 పై ఏ1 రెడ్డి కన్నుపడింది. కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవిత కు అనర్హం అన్నట్టు ఏ1 రెడ్డి గారి అవినీతికి ఇసుక, మద్యం ఆఖరికి గ్రూప్ 1 పరీక్షలు కాదేది అనర్హం. గ్రూప్ 1 పరీక్షలు రాసిన అభ్యర్థుల జీవితాలను నాశనం చేస్తున్నాడు ఏ1 రెడ్డి. ఏపీపీఎస్సీ ని వైసిపిపీఎస్సీ గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు'' అని విమర్శించారు. 

''ఏ1 రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్షల పేపర్ లీకేజ్,ఉద్యోగాలు అమ్ముకోవడం చూసాం. రాజ్యాంగబద్దమైన వ్యవస్థ ఏపీపీఎస్సీ. చంద్రబాబు  హయాంలో రాజీకీయాలకు సంబంధం లేని వారిని ఏపీపీఎస్సీ లో నియమించారు. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ని ఏపీపీఎస్సీ ఛైర్మెన్ గా నియమించిన ఘనత చంద్రబాబు గారిది. కానీ ఏ1 రెడ్డి ఏపీపీఎస్సీ ని బ్రష్టు పట్టిస్తున్నాడు. కనీస విద్యార్హత లేని వారు, రాజకీయలకు సంబంధం ఉన్నవారు, ప్రతిపక్ష నాయకుల పై అక్రమ కేసులు పెడుతున్న అధికారుల బంధువులని ఏపీపీఎస్సీలో నియమిస్తున్నారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఆఫీస్ కి తాళం వేసిన మూర్ఖుడు ఈ ఏ1 రెడ్డి'' అని మండిపడ్డారు. 

read more  దోచేస్తున్నారు: పోలవరంపై ఫిర్యాదు, గజేంద్ర షెకావత్ కు కాలి చూపించిన రఘురామ

''లక్షలమంది యువత పోటీ పడే గ్రూప్-1 పరీక్షల్లో విజయం సాధించడానికి మీరు పడే కష్టం నాకు తెలుసు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కోసం అభ్యర్థులు ఎంతో శ్రద్దగా చదువుకుంటారు. గ్రూప్-1 ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా వచ్చిన ఇతర ఉద్యోగాలని సైతం వద్దనుకునేవారు ఉంటారు. ఒక్క తెలుగుదేశం పార్టీ హయాంలో మాత్రమే సక్రమంగా పరీక్షలు నిర్వహించి,అర్హులకు ఉద్యోగాలు కల్పించాం. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు గైడ్ లైన్స్ ని మాత్రమే ఫాలో అవ్వాలి. అలాంటిది ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు అక్రమాలకు పాల్పడ్డారు'' అని ఆరోపించారు. 

''2018లో జారీ అయిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కు మెయిన్స్, రాత పరీక్ష గత ఏడాది డిసెంబర్ లో జరిగింది. ఈ ఏడాది  ఏప్రిల్ 28న ఫలితాలు ప్రకటించారు. దాదాపు 9678 మంది అభ్యర్థుల్లో ఇంటర్వ్యూ రౌండ్‌కు స్పోర్ట్స్ కోటాతో కలిపి  340 మంది ఎంపికయ్యారు. ఈ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులు సబ్ కలెక్టర్లుగా, ఆర్డీవోలుగా, ఉన్న‌తాధికారులుగాను సేవలందిస్తారు. కాబట్టి, పరీక్షా విధానం పారదర్శకంగా, న్యాయంగా, లోపాలు, పక్షపాతం లేకుండా ఉండటం చాలా ముఖ్యం'' అని లోకేష్ పేర్కొన్నారు. 

''పరీక్షలకు సంబంధించిన  వేల్యూష‌న్‌ సక్రమంగా జరగలేదనే ఫిర్యాదులు అనేకం వచ్చాయి. ఎంపిక విధానం గతంలో జరిగిన ప్రక్రియకు విరుద్ధంగా ఉంది. ఎలాంటి అధ్యయనం లేకుండా  డిజిటల్ వేల్యూష‌న్‌ని ఎంచుకోవటం అనేక విమర్శలకు తావిస్తోంది.  మాన్యువల్ వేల్యూష‌న్ చేయ‌డం కోసం రూపొందించిన జవాబు పత్రాలను డిజిటల్ పద్దతిలో చేయటం వల్ల అర్హులైన వారు నష్టపోతున్నారు. గైడ్ లైన్స్ లో మాన్యువల్ వేల్యూష‌న్ అని ఉంటే మధ్యలో డిజిటల్ వేల్యూష‌న్ కి ఎందుకు వెళ్లారు?వేల్యూష‌న్ ఎక్కడ జరిగింది?అసలు ఆ విధానం ఫాలో అయ్యారు?'' అని లోకేష్ నిలదీశారు. 

''అక్రమాలు జరిగిన మాట వాస్తవం. కానీ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడినట్టు వ్యవహరిస్తోంది. మీరు అడుగుతున్నవి న్యాయమైన డిమాండ్స్. రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి. తక్షణమే చర్యలు తీసుకోవాలి. మెయిన్స్ జవాబు ప‌త్రాల‌ను మాన్యువ‌ల్ వేల్యూష‌న్‌ చేయాలి. ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లు, అంద‌రి అభ్యర్థుల మార్కులను వెల్లడించాలి. ఇది వారి తదుపరి ప్రయత్నం కోసం, లోపాలు సరిచేసుకునేందుకు ఉపయోగపడుతుంది. డిజిటల్ వేల్యూష‌న్‌కి సంబంధించిన సాంకేతికత ఎస్వోపి పై శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. ఎంపిక చేయని అభ్యర్థులందరి మార్కులు, వారి జ‌వాబు ప‌త్రాల‌ను విడుదల చేయాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios