ఏపీ కేబినెట్ భేటీ... జాబ్ క్యాలెండర్ రద్దుకు లోకేష్ డిమాండ్
బుధవారం ఏపీ కేబినెట్ భేటి జరగనున్న నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ డిమాండ్ చేశారు.
అమరావతి: వైసిపి సర్కార్ ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ తీవ్ర దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. ఈ క్యాలెండర్ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసేలా వుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం ఆరోపణలే కాదు ఆందోళనలు కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఏపీ కేబినెట్ భేటి జరగనున్న నేపథ్యంలో ఈ జాబ్ క్యాలెండర్ ను రద్దు చేయాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ డిమాండ్ చేశారు.
''అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపి కాసేపు మంత్రులతో, అధికారులతో మాట్లాడితే కొంతవరకైనా వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది వైఎస్ జగన్ గారు! నిరుద్యోగులను నిలువునా ముంచేసిన మీ జాబ్ లెస్ క్యాలెండర్ ని రద్దు చేస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు.
''పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. మీరు ఆత్మలతో కాకుండా మీ అంతరాత్మతో మాట్లాడి నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు లోకేష్.
video జాబ్ క్యాలెండర్ ఎఫెక్ట్... మంత్రి అవంతి ఇంటిని ముట్టడించిన నిరుద్యోగులు
ఇదిలావుంటే ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై నిరసన వ్యక్తం చేస్తూ ఇప్పటికే నిరుద్యోగులు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. రోడ్లపై మానవహారాలు కట్టి.. పలు చోట్ల కలెక్టరేట్లు ముట్టడించారు. జాబ్ క్యాలెండర్ బోగస్ అని, తక్షణమే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీని విలీనం చేసి 59 వేల ఉద్యోగాలు ఇచ్చామని ఎలా చెబుతారంటూ మండిపడ్డారు. గౌరవవేతనం కింద పనిచేసే వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఎలా అవుతారని నిలదీశారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ముందు నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని, పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం కోట క్రాస్ రోడ్స్ వద్ద విద్యార్థి సంఘాల నేతలు మానవ హారం కట్టారు. తర్వాత కలెక్టరేట్ కు భారీ ర్యాలీ తీశారు.
జాబ్ క్యాలెండర్ తో ఏమాత్రం లాభం లేదన్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కర్నూల్ కలెక్టరేట్ వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జాబ్ క్యాలెండర్ బాగోలేదంటూ గుంటూరులో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.