ఇదే నిదర్శనం: జగన్ ప్రభుత్వంపై నారా లోకేష్ ట్విట్టర్ వార్
కరోనా వైరస్ పై యుద్ధం చేస్తున్న డాక్టర్లకు, నర్సులకు, ప్రభుత్వాధికారులకు కనీసావసరాలు కూాడ వైఎస్ జగన్ ప్రభుత్వం కల్పించడం లేదని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్ ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంది. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విమర్శలు చేశారు.
అనంతపురం జిల్లాను ఉదహరిస్తూ, అందుకు సంబంధించిన లెక్కలను జత చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. కరోనా వైరస్ మీద ముందుండి సమరం సాగిస్తున్నవారికి ప్రాథమిక అవసరాలైన మాస్కులు, పిపీఈలు అందించడం లేదని చెప్పడానికి అనంతపురం జిల్లానే ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు.
అనంతపురం జిల్లాలో పలువురు డాక్టర్లు, నర్సులు, ప్రభుత్వాధికారులు కోవిడ్ -19పై ఆయుధాల లేకుండా యుద్ధం చేస్తూ దాని ప్రభావానికి లోనవుతున్నారని ఆయన అన్నారు.