జనసేన నేతలతో నారా బ్రహ్మణి భేటీ : పవన్ కల్యాణ్ ఎక్కడా? అంటూ ఆరా...
జనసేన నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశానికి హాజరైనవారితో పవన్ కల్యాణ్ ఎక్కడా? అంటూ ఆరా తీశారు.

తూర్పుగోదావరి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన తర్వాత పరిణామాల్లో భాగంగా… టిడిపితో జనసేన పొత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పొత్తు మీద టిడిపి, జనసేన కేడర్లలో గందరగోళం నెలకొంది. జనసేన నేత నాగబాబు ముందే తాజాగా ఆ పార్టీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ స్థాయిలో అసంతృప్తి వ్యక్తమైనా కూడా నాగబాబు టిడిపి తో కలిసి ప్రయాణం చేయడం తప్పదంటూ కార్యకర్తలకు సూచించారు.
కాగా మరోవైపు జనసేన నేతలతో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కోడలు, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మిణి ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆదివారం నాడు నారా బ్రాహ్మణితో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నేతలు రాజమహేంద్రవరం విద్యానగర్లో ఉన్న లోకేష్ క్యాంపు దగ్గర సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి హాజరైన నారా బ్రాహ్మణి.. జనసేన నేతలను చూసి పవన్ కళ్యాణ్ ఎక్కడ? అని ప్రశ్నించారు. దీంతో జనసేన నేతలు అయోమయానికి గురయ్యారు. కంగు తిన్నారు. ఇలాంటి మీటింగ్లకు కూడా తమ అధినేతను అడగడం చూసి ఆశ్చర్యంతో గుసగుసలు పెట్టుకున్నారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక… ఆయన తన పనిలో తాను బిజీగా ఉన్నారని సమాధానం చెప్పారు. ఆ సమాధానం విన్న నారా బ్రాహ్మణి అవునా అన్నట్లుగా తల ఊపారని సమాచారం.
టిడిపి, జనసేన కలిసి చేసే ఉమ్మడి పోరాటానికి టిడిపి తమకు మద్దతు ఇస్తేనే ముందుకు సాగుతామని ఆ పార్టీ నేతలు నారా బ్రాహ్మణికి స్పష్టం చేశారు. ఈ పోరాటం కోసం నిధులు సమకూర్చాలని జనసేన నేతలు ఆమెను కోరినట్లుగా తెలుస్తోంది. దీనికి.. బ్రాహ్మణి మాత్రం ‘ నిధుల విషయం తర్వాత మాట్లాడదాం.. ఉమ్మడి పోరు ప్రారంభిద్దాం’ అని చెప్పినట్లు సమాచారం. దీంతో చేసేదేం లేక జనసేన నేతలు వెనక్కి తిరిగినట్లుగా తెలుస్తోంది.