చంద్రబాబు తొందరపడ్డారా...
అల్పజీవుల అసంతృప్తి కొంతయినా తెలుగుదేశానికి ట్రాన్స్ ఫర్ అవుతుందేమోనన్న బెంగ తమ్ముళ్లలో పుట్టింది
నవంబర్ ఎనిమిదో తేదీన ప్రధాని నరేంద్రమోడీ చేసిన అయిదొందల, వేయి రుపాలయ నోట్ల రద్దు ప్రకటన క్రెడిట్ ను క్షణం వృధాకానీయకుండా తన అకౌంటులో కలుపుకుని ఒక రోజంతా అదే అనందపు మత్తులో గడిపిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇపుడు ఏంచేయాలో దిక్కు తోచడం లేదని చెబుతున్నారు.
ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తూ హడావిడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తను చేసిన విజయ ప్రకటనను ఉపసంహరించుకోలేక తన నేత అయోమయంలో ఆయన పడ్డారని తెలుగుదేశం తమ్ముళ్లు చెబుతున్నారు.
ప్రకటన వచ్చాక పర్యవసానాలెలా ఉంటాయో తెలుసుకోకుండా మోదీ నిర్ణయం వెనక తండ్రి ప్రధానికి రాసిని లేఖ ప్రభావం ఉందని , సాక్ష్యంగా లేఖ కాపీలను కుమారుడు నారా లోకేష్ బాబు ట్విట్టర్ లో కూడా పోస్టు చేశారు.
అయితే, అర్ధ రాత్రి నుంచే వూరూర అసంతృప్తి పెల్లుబికింది.
తెల్లవారక ముందే దేశమంతా నోట్ల రద్దు దెబ్బకి దిమ్మతిరిగిన జనం ఎటిఎంల వెంబడి పరుగు దీయడం ప్రారంభించారు. 1947లో స్వాతంత్యం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ ప్రభుత్వ నిర్ణయం కూడా నూరు కోట్ల జనాన్నిఇలా బజారుకీడ్చలేదు. ఆంధ్రలో కూడా ఇదే జరిగింది. తీరా చూస్తే, ప్రధాని తీసుకున్న నిర్ణయాలు వేరు ముఖ్యమంత్రి ఇచ్చిన సలహా వేరు. కేంద్రం పెద్ద నోటును రద్దు చేయలేదు. పాతనోట్లను తీసేసి, కొత్త నోట్లను, ఇంకా పెద్ద నోటొక దాన్ని విడుదల చేసింది.
ఈ తికమకతో, రోడ్ల మీద బారులు తీరిన ప్రజలతో ,పత్రికల్లో, టివిలలో వస్తున్న వ్యతిరేక ప్రచారంతో తెలుగుదేశం పార్టీలో గుబులు మొదలయింది. నేత నిర్ణయం మీద చాలా చర్చ జరుగుతన్నట్లు తెలిసింది. తొందరపడి నోట్ల రద్దు నిర్ణయం వెనక తన లేఖ వుందని గొప్పలు చెప్పుకుని ఇరుకున పడ్డారని కొందరు అభిప్రాయపడుతున్నారు. బిజెపిని అవసరమయిన దానికంటే ఎక్కువ భుజానేసుకుంటే తాము మునిగిపోతామనే భయాన్ని కూడా కొంతమంది ఈ రోజు ఆయనకు సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.
కేంద్రాన్ని వేనకేసుకొచ్చాడన్న అగ్రహం టిడిపి వైపు మళ్లకుండా ఉండేందుకు, ముఖ్యమంత్రి బ్యాంకుల వాళ్లతో మాట్లాడటం, బ్యాంకుల కౌంటర్ల దగ్గిర, ఎటిఎంల దగ్గిర పరిస్థితిని సమీక్షించడం, కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని నొప్పి లేకుండా గిల్లి, ప్రజల్లో సానుభూతి సంపాదించుకునేందుకు ప్రయత్నం చేయడం. కొత్త రుపాయనోట్ల ఎలా పంపిణీ చేస్తే అన్ని బ్యాంకులకు అంది ప్రజల సమస్య పరిష్కారమవుతుందో సలహాలు ఇవ్వడం చేయాల్సి వస్తున్నదని వారంటున్నారు.
అయినా సరే, తుని దగ్గిర నుంచి తడ దకా, అమరావతి నుంచి లేపాక్షిదాకా పెల్లుబుకుతన్న అల్పజీవుల అసంతృప్తి కొంతయినా తెలుగుదేశానికి ట్రాన్స్ ఫర్ అవుతుందేమోనన్న బెంగ తమ్ముళ్లలో పుట్టింది. క్యూలో ఉన్న జనాలకు మజ్జిగ సరఫరా చేసే అలోచన కూడా పార్టీ నాయకత్వంలో ఉందని పార్టీ చెందిన ఒక పెద్దాయన ఏషియానెట్ కు చెప్పారు.