బాబు అనుమానం... ఫిరాయింపుదార్లు ఓట్లు తేగలరా?
ఇక నుంచి జిల్లాలవారిగా మీటింగులు పెట్టి ఎన్నికల్లో గెలిచేందుకు వీలుగా ఫిరాయింపు దార్లకు ‘స్పెషల్ స్టేటస్ ’ ఇవ్వాలని నిర్ణయించారు
వైసిపి ఎమ్మెల్యేలను లటుక్కున లాక్కున్నంత సులభంగా వాళ్ల నియోజకవర్గాలను 2019 ఎన్నికలలో టిడిపి అకౌంటులో కలిపేసుకోవచ్చన్న నమ్మకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కలుగుతున్నట్లు లేదు.
ఈ ఎమ్మెల్యేలు సీటు తెచ్చారుగాని ఓట్లు తేగలరా అనే శంక బాబులో మొదలయి గుచ్చుకుంటున్నట్లుంది.
ఫిరాయింపు చాప్టర్ సుఖంగా ముగియకపోవడమే దీనికి కారణం. ఫిరాయింపు జరిగిన ప్పటి నుంచి ఆ వివాదం రాజుకుంటూనే ఉంది. సుప్రీంకోర్టు దాకా వెళ్లడంతో ప్రజలలో ఫిరాయింపు మీద సదభిప్రాయం లేదని వేగుల వారి నుంచి ముఖ్యమంత్రి సమాచారం అందినట్లు తెలిసింది.
అందువల్ల ఆయన ఏమయినా సరే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలను గెల్చుకోవలసిందే నని ప్రతిజ్ఞ చేశారు. ఇక నుంచి ఆయన జిల్లాలవారిగా మీటింగులు పెట్టి ఫిరాయింపు దార్లకు ఎన్నికల్లో గెలిచేందుకు వీలుగా ‘స్పెషల్ స్టేటస్ ’ ఇవ్వాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలకు చెందిన నలుగురు ఫిరాయింపు దార్లకు ‘ స్పెషల్ స్టేటస్ ’ ఇచ్చారు. నిన్న రాత్రి పొద్దపోయే వరకు జిల్లానాయకులతో జరిపిన సమావేశంలో అందరి ఎదురుగా ఆయన అద్దంకి, చీరాల, కందుకూరు,గిద్దలూరు శాసన సభ్యులు ఫుల్ పవర్స్ ఇస్తున్నానని చెప్పారు.
నియోజకవర్గాల్లో వారే సుప్రీమ్ అని, వారే మీ చేసిన అడ్డు చెప్పవద్దని, నియోజకవర్గాలకు నియమించిన పార్టీ ఇన్ చార్జీలు కూడా ఇక్కడ డమ్మీలేనని చెప్పేశారు. ఇందులో చీరాల తప్ప మిగతా ముగ్గురు వైసిపి నుంచి ఉడాయించిన వారే. విబేదాలు మర్చిపోయి సమన్వయంతో పనిచేసి 12 సీట్లు గెల్చాలని ఆయన ఖరాకండిగా చెప్పారు. ఈ నాలుగు నియోజకవర్గాలు చాలా ముఖ్యమని అక్కడ శాసనసభ్యులే సుప్రీమ్లని, ఇన్చార్జిలు కాదనడం అందరిని ఆశ్చర్యపరిచింది.
ఈ సమావేశంలో నూతనంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కరణం బలరామ్కృష్ణమూర్తి, పోతుల సునీత కూడా ఉన్నారు. గిద్దలూరు, కందుకూరు ఇన్చార్జి అన్నా రాంబాబు, దివి శివరామ్లకు ఈ విషయం తెలిసిందేమో సమావేశానికి హాజరుకాలేదు. రాష్టమ్రంత్రులు శిద్దా రాఘవరావు, రావెల కిషోర్, మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, డోలా బాలవీరాంజనేయ స్వామి, కదిరిబాబూరావు. ముత్తమల అశోక్రెడ్డి, పాలపర్తి డేవిడ్ రాజు, ఏలూరి సాంబశివరావు, ఆమంచి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
అద్దంకినుంచి రవికుమార్, కందుకూరు నుంచి పోతుల రామారావు, గిద్దలూరి నుంచి అశోక్ రెడ్డి వైసిపి తరఫున గెల్చి టిడిపిలో చేరారు. చీరాల నుంచి గెల్చిన ఆమంచి స్వతంత్ర అభ్యర్థి.