నంద్యాలలో గెలుపు ఎలా?
ఉపఎన్నికలో ఖచ్చితంగా గెలవాల్సిన అవసరాన్ని చంద్రబాబు మంత్రులకు నొక్కి చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతీ మండలానికి ప్రత్యేకంగా ఇతర మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు నేతలను కూడా కమిటీలుగా వేసి ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పటంతోనే చంద్రబాబులో ఆందోళన స్పష్టంగా తెలిసిపోతోంది.
నంద్యాల ఉపఎన్నికలో ఎలా గెలవాలన్న విషయమై చంద్రబాబునాయుడు పెద్ద ఎత్తున కసరత్తు మొదలుపెట్టారు. ఈరోజు సమన్వయ కమిటి సమావేశం అయిపోయిన తర్వాత నంద్యాలపై మంత్రులు కెఇ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులు, నారాయణ, అమరనాధరెడ్డి, అఖిలప్రియ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నంద్యాలలో గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలు, అవలంభించాల్సిన వ్యూహాలను చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు.
క్షేత్రస్ధాయిలో పార్టీకున్న పట్టు, అభ్యర్ధి విషయంపైనే ఎక్కువసేపు చర్చ సాగింది. పనిలోపనిగా శిల్పా మోహన్ రెడ్డి వ్యవహారంపైన కూడా చర్చ జరిగింది. ఏ వర్గం ఎవరికి మద్దతు ఇస్తోంది, ఎవరెవరిని కలవాలన్న అంశాలపై అఖిలనడిగి వివరాలు తీసుకున్నారు. ఉపఎన్నికలో ఖచ్చితంగా గెలవాల్సిన అవసరాన్ని చంద్రబాబు మంత్రులకు నొక్కి చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతీ మండలానికి ప్రత్యేకంగా ఇతర మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు నేతలను కూడా కమిటీలుగా వేసి ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పటంతోనే చంద్రబాబులో ఆందోళన స్పష్టంగా తెలిసిపోతోంది.