చంద్రబాబుకు కుర్చీ బహూకరించిన ఖైదీలు
రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు అందంగా తయారు చేసిన ఒక కుర్చీని ముఖ్యమంత్రికి కానుకగా ఇచ్చారు.
ముఖ్యమంత్రి శనివారం నాడు ఇక్కడి కేంద్ర కారాగారంలో పరిపాలనా భవనానికి శంకు స్థాపన చేశారు. అనంతరం ఆయన ఖైదీలో ముఖాముఖిలో పాల్గొన్నారు.
రాజమహేంద్ర వరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ బ్రహ్మం, అతని సహచరులు కష్టపడి, ప్రత్యేకంగా తయారుచేసిన కుర్చీని ముఖ్యమంత్రి కి బహూకరించారు.
ముఖ్యమంత్రి ఆ కూర్చీలో కూర్చున్న బ్రహ్మాన్ని అభినందించారు. ఫర్నీచర్ ను ఆధునికంగా తయారుచేయడానికి కొన్ని సూచనలు కూడా చేశారు.
జైళ్లలో ఉన్న ఖైదీల కష్టాలు తగ్గించడానికి సంస్కరణలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఖైదీలకు చెప్పారు. అక్కడ ఉన్న ఖైదీలకు శిక్ష పడటానికి కారణమయిన నేరాలను అడిగి తెలుసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీలు తయారు చేసిన మంచాలు, వస్త్రాలను కూడా ఆయన పరిశీలించారు. ఓపెన్ ఎయిర్ కారాగారంలోపండించిన కూరగాయలను కూడా ఆయన పరిశీలించారు.
గతంలో తాను జైళ్లను బహిరంగజైళ్లుగామార్చే విషయం యోచన చేసినట్లు కూడా ఆయన వారికి చెప్పారు. ఖైదీలలో పరివర్తన తీసుకువచ్చే విధంగా జైళ్ల సంస్కరణలు ప్రవేశపెట్టే యోచన ఉందని కూడ ఆయన చెప్పారు.